రాముడు రావణుడు కలవడం లేదు

ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన టీజర్ మీద నెగటివ్ కామెంట్స్ బాగానే వచ్చాయి. ఏఐ వాడిన తీరు, ప్రాపర్ ఫినిషింగ్ లేకుండా కంపోజ్ చేసిన విజువల్స్ సినీ ప్రియుల అసంతృప్తికి దారి తీశాయి. బాహుబలి రేంజ్ లో మాట్లాడుకుంటారనుకుంటే ఆదిపురుష్ తో పోలిక తెచ్చి సోషల్ మీడియాలో చిన్నపాటి ట్రోలింగ్ చేశారు. ప్రస్తుతం టీమ్ ఇవన్నీ సరిదిద్దే పనిలో ఉంది.

ఇదిలా ఉండగా రామాయణ ప్రమోషన్లలో భాగంగా విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ ఒక బాంబు పేల్చాడు. రామాయణ పార్ట్ 1లో రన్బీర్ కపూర్, తాను ఒకే ఫ్రేమ్ లో కనిపించే సన్నివేశాలు, ఎపిసోడ్లు ఉండవని, వేర్వేరుగా దర్శకుడు నితేశ్ తివారి తమను ఎస్టాబ్లిష్ చేశాడని అన్నాడు. సెట్స్ లో రెండు మూడు సార్లు మాత్రమే ఇద్దరం కలుసుకున్నామని చెప్పి ఇంకో ట్విస్టు ఇచ్చాడు. సరికొత్త టెక్నాలజీలు రామాయణతో పరిచయం చేస్తామని అంటున్నాడు.

ఈ లెక్కన గతంలో వచ్చిన ప్రచారం నిజమే అనుకోవాలి. అంటే రామాయణ పార్ట్ 1 రావణుడు అడవికి వచ్చి సీతను ఎత్తుకెళ్ళడం దగ్గర ఆగిపోతుంది. అప్పటిదాకా రాముడుని కలిసే సందర్భం అతనికి రాదు. గతంలో వచ్చిన సీరియల్స్, సినిమాల్లోనూ ఇదే ప్యాట్రన్ గమనించవచ్చు. ఈ లెక్కన మూడు గంటల నిడివిలో వీళ్ళ కలయిక జరగదంటే కొంచెం షాక్ ఇచ్చే విషయమే అయినా అంతసేపు ఎలా ఎంగేజ్ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని కంకణం కట్టుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తాను చెప్పిన నాలుగు వేల కోట్ల బడ్జెట్ కు తగ్గ కంటెంట్ ని ప్రమోషన్ మెటీరియల్ లో చూపించాల్సి ఉంటుంది. ట్రైలర్ కు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. సాయిపల్లవి సీతగా, సన్నీడియోల్ హనుమంతుడిగా నటిస్తున్న రామాయణకు ఏఆర్ రెహమాన్, జిమ్స్ హ్యామర్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.