పాపం హరీష్… నిజం ఒప్పేసుకున్నారు

కొందరు దర్శకులు రియాలిటీలో ఉండరు. తమ సినిమా పోయిందని తెలిసినా, డిజాస్టరని ప్రేక్షకులు తేల్చేసినా కూడా ఆ నిజాన్ని ఒప్పుకోరు. రకరకాల కారణాలు చూపించి ఆడలేదు అంటారు తప్పించి వాస్తవాన్ని అంగీకరించే ఉద్దేశంలో ఉండరు. కానీ హరీష్ శంకర్ త్వరగా రియలైజ్ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నంత ఆడలేదని, అందుకే తనను పాపం హరీష్ అని యాంకర్ పిలిచినట్టుగా పొరపాటు పడ్డానని, పాపం ప్రతాప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

హరీష్ ఉద్దేశం ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ ని కాదనకుండా దాని ప్రస్తావన తేవడం మెచ్చుకోదగ్గ విషయమే. ఎందుకంటే ఈ సినిమా విషయంలో అంతా తానై విపరీతమైన ప్రమోషన్లు చేసింది ఈయన ఒక్కరే. పవన్ కళ్యాణ్ సైతం ఈవెంట్ అయిపోయాక పాలనలో బిజీ అయ్యారు కానీ హరీష్ మాత్రం వారం రోజుల పాటు పబ్లిసిటీ కోసం విపరీతంగా శ్రమ పడ్డారు. శ్రీలీల, రాశిఖన్నాను వెంటబెట్టుకుని ఎన్నో చోట్ల ప్రచారం చేశారు, ఎందరో ఫ్యాన్స్ ని కలుసుకున్నారు.

గత నెల మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో రిలీజ్ అయితే ఏప్రిల్ 16 నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తోంది. అంటే పట్టుమని నెల కూడా తిరక్కుండానే డిజిటల్ బాట పట్టేసింది. ఇందులో ఆశ్చర్యం లేదు కానీ నిర్మాతలు అయిదు వారాల తర్వాతే వస్తుందని అప్పట్లో చెప్పడం గుర్తు చేసుకోవాలి. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తనకు వరసగా రెండో ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ ఎనిమిదేళ్లలో దక్కిన హిట్టు గద్దలకొండ గణేష్ ఒక్కటే.

అన్నట్టు హరీష్ శంకర్ ఇంకో ఆసక్తికరమైన సంగతి చెప్పుకున్నారు. తాను తీసినవి తొమ్మిది సినిమాలైతే క్యాన్సిల్ అయినవి పంతొమ్మిది ఉంటాయని, ముహూర్తం దాకా వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయని షాక్ ఇచ్చారు. 2026లో హీరోల అభిమానుల వల్ల టార్గెట్ అయిన దర్శకుల్లో మారుతీది మొదటి స్థానం. కాకపోతే రాజా సాబ్ అంత దారుణంగా ఉస్తాద్ భగత్ సింగ్ లేకపోవడంతో హరీష్ కొంచెం సేఫ్ అయ్యారు. ట్రోలింగ్ అయితే తప్పించుకున్నారు కానీ రిజల్ట్ అయితే మారలేదు.