ర‌జినీపై విరుచుకుప‌డుతున్న విజ‌య్ ఫ్యాన్స్

త‌మిళంలో సినిమాల ప‌రంగా చాలా ఏళ్ల నుంచి సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానుల మ‌ధ్య వైరం ఉంది. ఎన్నో ఏళ్ల పాటు ర‌జినీనే త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉండ‌గా.. కొన్నేళ్ల నుంచి విజ‌య్ ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నాడు. ర‌జినీని మించి అత‌ను ఎదిగిపోవ‌డం సూపర్ స్టార్ అభిమానుల‌కు రుచించ‌లేదు. అందుకే విజ‌య్‌ని టార్గెట్ చేస్తుంటారు.

అదే స‌మ‌యంలో ర‌జినీని విజ‌య్ అభిమానులు డీగ్రేడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. రాజ‌కీయాల విష‌యంలోనూ ఇరువురి అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియా యుద్ధాలు జ‌రుగుతుంటాయి. ఈ గొడ‌వ ఇలా ఉండ‌గా.. విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ర‌జినీ వ్య‌వ‌హరిస్తున్న తీరు ప‌ట్ల విజ‌య్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే గుర్రుగా ఉన్నారు.

గత ఏడాది కరూర్ విషాదం నేపథ్యంలో రజినీ సోషల్ మీడియా పోస్ట్ పెట్టడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. రజనీ విమర్శలు చేయకపోయినా ఆ పోస్టును తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల విషాదాలు జరిగినపుడు స్పందించని రజినీ విజయ్ కి ఇబ్బందికరంగా మారిన అంశంలో మాత్రం కావాలనే స్పందించాడన్నది వారి ఆరోపణ. కాగా విజయ్ సినిమా జననాయగన్ విడుదల విషయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ, దీని చుట్టూ ఎన్ని కుట్రలు చోటు చేసుకుంటున్నప్పటికీ సాటి సినిమా వాడిగా రజినీ స్పందించకపోవడం పట్ల విజయ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

ఇటీవలే మీడియా ముందుకు వచ్చినపుడు జననాయగన్ ప్రస్తావన తెస్తే నో కామెంట్ అనేశాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఈ చిత్రం ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. దీని పట్ల అవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ రజినీ కంటే ముందే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు సహా పలువురు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. తీర నిన్న సాయంత్రం రజినీ పోస్ట్ పెట్టే సమయానికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.

ఐతే విడుదల సంగతి ఎలా ఉన్నా.. సినిమా పైరసీ అయి, ఆన్లైన్లో లీక్ కావడం పట్ల ఇండస్ట్రీ పెద్దలుగా వెంటనే స్పందించి, ఖండించాల్సిన బాధ్యత రజనీ, కమల్ మీద ఉందని.. వాళ్లిద్దరూ ఇతర ఇండస్ట్రీ హీరోలు ఖండించేంత వరకు మౌనం వహించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రజనీ పట్ల విజయ్ అభిమానుల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆయన మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.