సందీప్ రెడ్డిది పెద్ద ప్లానింగే…

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక థియేటర్‌కు వెళ్లి.. సామాన్య జనం మధ్య సినిమా చూడడం అరుదైన విషయమే. సాధారణంగా సెలబ్రెటీలు.. తమ హోం థియేటర్లలో స్పెషల్ షో వేయించుకుని సినిమా చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం హైదరాబాద్‌ కోకాపేటలోని అల్లు సినిమాస్‌కు వెళ్లి ‘దురంధర్-2’ సినిమా చూశాడు.

తనతో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సైతం వెంట ఉన్నాడు. ఇద్దరూ కలిసి ‘దురంధర్-2’ థియేటర్లో ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ప్రభాస్ ఇలా వచ్చి సినిమా చూడడం తన సింప్లిసిటీని తెలియజేసేదే. కానీ దీని వెనుక సందీప్ రెడ్డికి వేరే ప్లానింగ్ ఉందనే చర్చ జరుగుతోంది. అతను ఉద్దేశపూర్వకంగానే ప్రభాస్‌ను తీసుకెళ్లి థియేటర్లో పబ్లిక్ మధ్య సినిమా చూపించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ చివరి చిత్రం ‘రాజాసాబ్’ ఎంతగా విమర్శల పాలైందో తెలిసిందే. అందులో ప్రభాస్ చాలా వరకు డూప్‌ల మీద ఆధారపడడం.. పెర్ఫామెన్స్ మీద దృష్టిపెట్టకపోవడం మీద సొంత అభిమానులే పెదవి విరిచారు. ‘బాహుబలి’ తర్వాత చాలా వరకు ప్రభాస్ సినిమాల్లో లుక్స్, పెర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో లేవన్నది వాస్తవం.

అతను కష్టపడడం మానేశాడు.. ఫోకస్ తగ్గింది అన్న విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘దురంధర్’లో రణ్వీర్ సింగ్ చూపించిన అంకితభావం, తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్, లుక్స్ కోసం పడ్డ కష్టం ఎలాంటిదో చూపించడానికే సందీప్ రెడ్డి తనకీ సినిమా చూపించి ఉండచ్చని భావిస్తున్నారు.