భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె సినిమాలు చేశారు. ‘స్వర్ణకమలం’ సహా ఎన్నో చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆమె కట్టిపడేశారు. ఐతే తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నేళ్లు క్యారెక్టర్ రోల్స్‌లో కనిపించిన భానుప్రియ.. క్రమంగా సినీ రంగానికి దూరం అయిపోయారు. కొన్నేళ్లుగా భానుప్రియ ఆరోగ్యం బాగా లేదని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఆమె పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని.. డిమెన్షియా కారణంగా మతిస్థిమితం కూడా కోల్పోయిందని.. ఎవరినీ గుర్తించే పరిస్థితిలో కూడా లేదని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై భానుప్రియ చెల్లెలు, ‘మహర్షి’ సహా పలు చిత్రాల్లో నటించిన శాంతి ప్రియ స్పందించారు. భానుప్రియ ఆరోగ్యం బాగా లేని మాట వాస్తవమే అని.. కానీ ఆమె జ్ఞాపక శక్తి కోల్పోయి ఎవరినీ గుర్తించలేని స్థితిలో ఉందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆమె స్పష్టం చేసింది.

ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ భానుప్రియను పట్టించుకోవడం లేదని.. 80వ దశకం రీ యూనియన్‌కు కూడా తన సోదరిని పిలవట్లేదని శాంతి ప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. భానుప్రియ ఫోన్ నంబర్ లేకపోతే తనకు లేదా తమ అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడొచ్చని.. ఇండస్ట్రీలో అందరికీ ఆయన తెలుసని.. అయినా ఎవ్వరూ భానుప్రియ కోసం సంప్రదించలేదని శాంతి ప్రియ పేర్కొంది.

భర్త మరణం తర్వాత భానుప్రియ డిప్రెషన్‌కు గురైందని.. ఆమె కొన్నేళ్లుగా మనోవేదన అనుభవిస్తోందని శాంతిప్రియ చెప్పింది. ఆమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. కానీ తన పాత్ర గురించి ముందు ఒకటి చెప్పి, తీరా షూట్‌కు వెళ్లాక ఆ పాత్రలను మార్చేయడం వల్ల భానుప్రియ ఎంతో బాధ పడ్డారని.. అందుకే ఆమె సినిమాలకు దూరం అయ్యారని ఆమె చెప్పింది.

భానుప్రియ ఇకపై సినిమాల్లో నటించరని.. తాను మాత్రం నటిగా కొనసాగుతానని శాంతి ప్రియ స్పష్టం చేసింది. ‘బ్యాడ్ గర్ల్’ సినిమాలో తన పాత్రకు భానుప్రియనే డబ్బింగ్ చెప్పిందని.. ఆమె మానసిక స్థితి ఏమీ దెబ్బ తినలేదని.. ఆమె గురించి అసత్యాలు ప్రచారం చేయొద్దని శాంతి ప్రియ కోరింది.