రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా ఎన్నికల బరిలోకి దిగడంతో అందరి దృష్టి కోలీవుడ్ స్టార్లపై పడింది. ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన కేవలం ‘నో కామెంట్స్’ అని సమాధానం ఇచ్చి దాటవేశారు. గతంలో రాజకీయ ప్రకటనలతో హడావిడి చేసిన రజినీ, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ మొదలైంది.

రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండటం వెనుక భయం ఉందా లేక ముందు జాగ్రత్త ఉందా అనే కోణంలో ఆలోచిస్తే.. ఆయన పూర్తిస్థాయిలో తన సినీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనక్కి తగ్గిన తర్వాత, మళ్ళీ ఆ విషయాల జోలికి వెళ్లడం అనవసరమని భావిస్తున్నారు.

ముఖ్యంగా విజయ్ లాంటి యంగ్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు, తాను ఏదైనా మాట్లాడితే అది కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే సినిమాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోవడమే ఉత్తమమని రజినీ ఫిక్స్ అయ్యారు.

అసలు విషయానికి వస్తే, రజినీకాంత్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. అలాగే మరోవైపు లోక నాయకుడు కమల్ హాసన్ తో కలిసి ఆయన ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీనికి కూడా నెల్సన్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఈ మెగా కాంబినేషన్ ప్రాజెక్టు ఆగస్టు 2026 నుంచి పట్టాలెక్కనుంది. 

రాజకీయాల గురించి రజినీ మౌనం వహించడం వల్ల ఆయన జాగ్రత్తగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త ట్రాక్ లో ఉన్నాయి. ఒకవైపు పాత పార్టీలు, మరోవైపు విజయ్ లాంటి కొత్త పార్టీల మధ్య జరిగే ఈ పోరులో తలదూర్చడం వల్ల అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా షూటింగ్ లో ఉన్న సినిమాలపై ఈ ప్రభావం పడకుండా ఉండాలని రజినీ భావిస్తున్నారు. అందుకే తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నికల యుద్ధం నుంచి తనను తాను పక్కకు జరుపుకున్నారు.