నాగబాబు వల్ల కానిది నీహారిక చేస్తోంది

తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు ట్రాక్ రికార్డు మెగా ఫ్యాన్స్ కి బాగా తెలుసు. అన్నయ్య చిరంజీవితో తీసిన మొదటి ప్రొడక్షన్ డెబ్యూ ‘రుద్రవీణ’ కమర్షియల్ గా పెద్ద ఫెయిల్యూర్. చిరు వందో సినిమా ‘త్రినేత్రుడు’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆయన ట్రిపుల్ రోల్ చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సైతం హిట్టుకి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఇవేవి సక్సెస్ ఫుల్ మూవీస్ కాదు.

ఒక్క ‘బావగారు బాగున్నారా’ మాత్రమే హిట్టు కొట్టి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ కి కొంత మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మాములే. ‘గుడుంబా శంకర్’ పెద్ద స్థాయిలో ఆడుతుందనుకుంటే వర్కౌట్ కాలేదు. ‘ఆరెంజ్’ ఏకంగా ఓ రేంజ్ నష్టాలు తెచ్చిన డిజాస్టర్. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ నిలబట్టలేకపోయారు. దీంతో నాగబాబు ప్రొడక్షన్ కు దూరంగా ఉండిపోయారు. కొడుకు వరుణ్ తేజ్ హీరో అయ్యాక కూడా రిస్కులు వద్దనుకుని జనసేనకు షిఫ్ట్ అయిపోయారు.

కట్ చేస్తే నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా పెద్ద అడుగులే వేస్తోంది. ఇంట్లోనే స్టార్లు ఉన్నా వాళ్ళ వెంటపడకుండా కొత్త టాలెంట్ ని నమ్ముకుని సినిమాలు తీయడం మంచి ఫలితం ఇస్తోంది. ‘కమిటీ కుర్రాళ్ళు’ గట్టి పోటీలోనూ హిట్టు కొట్టి డబ్బులతో పాటు అవార్డులు కూడా తీసుకొచ్చింది. తాజాగా ‘రాకాస’కు రెవిన్యూలు బాగున్నాయి. శర్వానంద్ బైకర్ లాంటి గట్టి పోటీ ఉన్నా సరే రాకాస తట్టుకుని నిలబడింది. సినిమా ఎక్స్ ట్రాడినరి లేకపోయినా జనాన్ని ఓ మోస్తరుగా మెప్పించినట్టే ఉంది.

అన్న వరుణ్ తేజ్ తో ఆల్రెడీ ‘బరి’ని మొదలుపెట్టిన నీహారిక ఆ అవకాశం కూడా కమిటీ కుర్రాళ్ళు దర్శకుడికే ఇచ్చింది. నాగబాబు లాగా పెద్ద బడ్జెట్ లను రిస్క్ లో పెట్టకుండా థియేటర్, ఓటిటి రెండింటిపరంగా సేఫ్ అయ్యే కాంబోలనే నీహారిక సెట్ చేసుకున్న వైనం స్పష్టం. ప్రమోషన్ల విషయంలో తను చూపిస్తున్న యాక్టివ్ నెస్ అంతా ఇంత కాదు. ఏకంగా రామ్ చరణే మాట సాయం చేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టాక చరణ్ కూడా ఒక స్టేజి తర్వాత ఆగిపోయాడు. కానీ నీహారిక ఆపేలా లేదు.