మనోడితో సినిమా.. రణబీర్ కన్ఫమ్ చేశాడు


‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి మూడున్నరేళ్లవుతోంది. కానీ ఆ సినిమాతో సంచలనం రేపిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తన రెండో కథతో సినిమా మొదలు పెట్టలేదు. ‘అర్జున్ రెడ్డి’నే హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా బ్లాక్‌బస్టర్ అందుకున్న సందీప్.. ఆ తర్వాతి సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు.

‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే తన తర్వాతి చిత్రాన్ని కమిటై.. దాని గురించి చాలా కాలం కిందటే అనౌన్స్ చేశాడు కానీ.. ఇప్పటిదాకా అది పట్టాలెక్కలేదు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరో అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మధ్య వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘అనిమల్’ అనే సినిమా రాబోతోందని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. టైటిల్ సంగతేమో కానీ.. ఈ కాంబినేషన్ అయితే ఎట్టకేలకు ఖరారైంది.

తాజాగా ఓ వీడియో ఇంటర్వ్యూల రణబీర్ సందీప్‌తో సినిమాను కన్ఫమ్ చేశాడు. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో బిజీగా ఉన్న రణబీర్.. తర్వాతి సినిమాను ‘కబీర్ సింగ్’ ఫేమ్ సందీప్‌తో చేయబోతున్నానని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐతే దీని షూటింగ్ మొదలు కావడానికి సమయం పడుతుందని అన్నాడు. వచ్చే ఏడాది మధ్యలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చన్నాడు. ఈ సినిమా పేరు ‘అనిమల్’నా కాదా అనే విషయంపై రణబీర్ మాట్లాడలేదు.

మొత్తానికి రణబీర్‌ లాంటి టాప్ స్టార్, మంచి నటుడితో సందీప్‌ సినిమా ఖరారవడం ఆయన అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. ఐతే ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేసేసరికి 2022 సగం పూర్తయిపోతుందేమో. అప్పటికి కానీ సందీప్ మళ్లీ టాలీవుడ్ బాట పట్టడేమో. ఇక్కడ విజయ్ దేవరకొండ సహా సందీప్ కోసం చాలామందే ఎదురు చూస్తున్నారు. మరి ఎవరితో తన తర్వాతి తెలుగు సినిమా తీస్తాడో చూడాలి.