భీకరమైన ఫామ్ లో ఉంటేనే దర్శకులకు స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కుతుంది. ఒక్క ఫ్లాప్ జాతకాలను తలకిందులు చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. కొందరు టయర్ 2 కథానాయకులతో సర్దుకుంటే మరికొందరు కొత్తవాళ్లకు షిఫ్ట్ అయిపోతున్నారు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి లాంటి అతి కొందరు మాత్రమే టాప్ లీగ్ లో తమ డిమాండ్ అంతకంతా పెంచుకుంటున్నారు. కానీ వంశీ పైడిపల్లి కేసు చాలా స్పెషల్ అనిపిస్తుంది.
వంశీ నుంచి సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. కోలీవుడ్ స్టార్ విజయ్ కోసం అక్కడి డైరెక్టర్లే ఛాన్స్ కోసం ప్రదక్షిణాలు చేస్తుండగా నిర్మాత దిల్ రాజు వెళ్లి ప్రాజెక్టు లాక్ చేసుకుని వరిసు(వారసుడు)ని వంశీ పైడిపల్లితో తీయించారు. రెస్పాన్స్ పరంగా సీరియల్ తరహాలో ఉందనే కామెంట్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు మహేష్ బాబు మహర్షి, నాగార్జున ఊపిరి, రామ్ చరణ్ ఎవడు, జూనియర్ ఎన్టీఆర్ బృందావనం అన్నీ హిట్టు కొట్టిన బ్యాచే.
డెబ్యూ మూవీ మున్నా ఒక్కటే వంశీ పైడిపల్లికి చేదు ఫలితం ఇచ్చింది. ఇక్కడ చెప్పిన ఏడు సినిమాల్లో ఆరు దిల్ రాజు నిర్మించినవి కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో సెట్ చేశారు దిల్ రాజు. ఇది నెలల తరబడి డిస్కషన్లు, నెరేషన్లలో ఉండగా ఫైనల్ గా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్ గా నయనతార దాదాపు ఫిక్స్. అఫీషియల్ అనౌన్స్ మెంట్ లో అన్ని వివరాలు రాబోతున్నాయి.
ఒక దర్శకుడికి ఇంత అండగా నిలబడిన దిల్ రాజు నమ్మకాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వంశీ పైడిపల్లికి ఎన్ని హిట్లు ఉన్నా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు, రికార్డులు బద్దలు కొట్టి వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు లేవు. అయినా సరే మినిమమ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడనే కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు ఆయన్ని అట్టి పెట్టేసుకున్నారు. తంతే బూరెల బుట్టలో పడటం పాత సామెత. వంశీ పైడిపల్లి మాత్రం రాజు గారి బుట్టలో బంగారు గారెలు తింటూ కెరీర్ చక్కదిద్దుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates