గత ఏడాది కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా దృష్టిలో పడి వైరల్ అయిన మోనాలిసా.. ఇటీవల తాను ప్రేమించిన ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయితో కేరళలో ప్రత్యక్షం కావడం, తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించడం.. అంతలోనే ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో చాలామంది ఇది లవ్ జిహాద్ అని ఆరోపించగా.. అదేమీ కాదని ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చింది. తనకు సినిమాలో అవకాశమిచ్చిన సనోజ్ మిశ్రా గురించి మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో తన తల్లిదండ్రుల మీద కూడా ఆమె విమర్శలు గుప్పించింది. మోనాలిసాను ఒక సినిమా కోసం తీసుకున్న సనోజ్.. తన పెళ్లి విషయంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను నమ్మి పది కోట్ల పెట్టుబడి పెడితే.. సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లిపోయిందని అతను ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో మోనాలిసా మాట్లాడుతూ సనోజ్ మిశ్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. పలుమార్లు తాకాడని ఆరోపించింది. ”సనోజ్ మిశ్రా సార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు ఇష్టంలేకపోయినా… నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. నన్ను అతను ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు. నాకు తెలియకుండా అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రీకరించేవాడు. అంతే కాదు సినిమాల్లో నటించడానికి వచ్చిన మైనర్ బాలికలతో అనుచితంగా ప్రవర్తించేవాడు.
ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఫర్మాన్ ను పెళ్ళి చేసుకునే సరికీ తట్టుకోలేపోతున్నాడు. మమ్మల్ని చంపేసినా తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నాడు. నేనేమీ ఆయనకు పెళ్ళి చేసుకోనని అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు. ఆయన సినిమాను కూడా పూర్తి చేశాను. నాతో పది కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నానని సనోజ్ చెబుతున్నాడు. అది కనీసం మూడు లక్షల విలువ కూడా చేయదు.
ఆయన చేసిన తప్పుడు పనులకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నాతో సనోజ్ మిశ్రా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మా కుటుంబ సభ్యులకు చెప్పినా వారు పట్టించుకోలేదు” అంటూ మోనాలిసా బోరున ఏడ్చింది. సనోజ్ మిశ్రా మీద మరో లైంగిక వేధింపుల కేసు నమోదు కాగా.. అతను అరెస్ట్ అయి తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
