నంది ఇష్యూ… చిరు చెప్పింది తప్పా ఒప్పా

నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పక్క రాష్ట్రం, ఇతర తెలుగు రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ని సంబోధిస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు, వివాదానికి దారి తీశాయి. సిఎం రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ కూడా నంది అవార్డులు ఇచ్చి, కళాకారులను గౌరవించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గారు చర్యలు తీసుకోవాలని చెప్పడం పలువురి ఆగ్రహానికి కారణమయ్యింది.

పదాల ఎంపికలో చేసిన పొరపాట్లే ఇంతటి అపార్థానికి దారి తీశాయని చెప్పొచ్చు. సింపుల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులు ఇస్తే బాగుంటుందని చెబితే ఏ గొడవా ఉండేది కాదు. అలా కాకుండా ఇన్స్ పిరేషన్ గా తీసుకోమని చెప్పడమే ఇంత దాకా తెచ్చింది. కొన్ని వారాల క్రితమే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ త్వరలో నంది అవార్డుల కోసం ఒక కమిటీ వేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక పదవిలో ఉన్న మినిస్టర్.

ఈ సమాచారం బహుశా చిరంజీవి దగ్గర ఉండపోవచ్చు లేదా ఎవరూ చెప్పలేదేమో. నిజానికి రెండు ఒకే భాష రాష్ట్రాల నుంచి రెండు ఒకే తరహా అవార్డులు ఇవ్వడం వల్ల సమస్యలు వచ్చే మాట వాస్తవమే. ఎందుకంటే పోలికలు వచ్చి లేనిపోని తలనొప్పి అవుతుంది. ఉదాహరణకు తెలంగాణ నేటివిటీ ఉన్న రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమా ఏపి కమిటీలో ఉన్న సభ్యులకు కనెక్ట్ కాకపోవచ్చు. అలాని వేరే చిత్రానికి ఇస్తే ఎవరైనా కాంట్రావర్సి చేయొచ్చు. అలాని ఇవ్వకూడదని కాదు. ఇవ్వాలి.

గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రెండు పర్యాయాలు సిఎంగా ఉన్నప్పుడు పది సంవత్సరాలకు పైగా నంది అవార్డులు ఆయన చేతుల మీదుగానే అందజేశారు. అలాంటప్పుడు ఆయన మర్చిపోయి ఉంటారనో నిర్లక్ష్యం చేస్తారనో అనుకోవడానికి లేదు.

టికెట్ రేట్ల కోసం మునుపటి సిఎం జగన్ ని కలిసిన టాలీవుడ్ పెద్దలు అప్పుడెందుకు నంది అవార్డుల గురించి గట్టిగా ప్రయత్నించలేదనే కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మెగాస్టార్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి చిరు మళ్ళీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.