బాలీవుడ్ కొన్నేళ్లు తలెత్తుకోవచ్చు

సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం. దేశంలో మిగతా ఇండస్ట్రీలు కూడా బాలీవుడ్‌ను అంత ఉన్నత స్థాయిలోనే చూసేవి. ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అనే ఫీలింగ్ ఉండేది.

కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ‘బాహుబలి’తో మొదలైన సౌత్ సినిమా ఆధిపత్యం.. ‘పుష్ప-2’ సమయానికి ఇంకో లెవెల్‌కు చేరుకుంది. అదే సమయంలో బాలీవుడ్ బాగా డౌన్ అయింది. సక్సెస్ రేట్ పడిపోయి.. వసూళ్ల రికార్డుల్లోనూ వెనుకంజ వేయడంతో బాలీవుడ్ ఆధిపత్యానికి తెరపడింది. ఐతే గత ఏడాది ఛావా, సైయారా, దురంధర్ చిత్రాలు హిందీ సినీ పరిశ్రమకు ఊపిరి పోశాయి. ముఖ్యంగా ‘దురంధర్’ బాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది. ఇప్పుడు ‘దురంధర్-2’ బాలీవుడ్‌ మరి కొన్నేళ్ల పాటు తల దించాల్సిన అవసరం లేకుండా చేసేలా ఉంది.

ఈ నెల 19న రిలీజ్ కానున్న ‘దురంధర్-2’.. బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలకు దీటుగా హైప్ తెచ్చుకుంది. పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే దీని క్రేజ్ పీక్స్‌కు చేరుకుంది. రిలీజ్‌కు ముందు రోజు సాయంత్రం నుంచి ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ పడుతుండగా.. దేశవ్యాప్తంగా అన్ని మేజర్ సిటీల్లో షోలు చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి.

ఫస్ట్, సెకండ్ షోలు ప్యాక్డ్ హౌస్‌లతో నడవబోతున్నాయి. రిలీజ్ రోజు, వీకెండ్‌కు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్‌ను కూడా కలుపుకుంటే.. డే-1 వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి.

బాహుబలి-2 సహా అన్ని సినిమాల కలెక్షన్ల రికార్డులను ‘దురంధర్-2’ బద్దలు కొట్టేస్తే ఆశ్చర్యమేమీ లేదు. వీకెండ్, ఓవరాల్ వసూళ్ల రికార్డులను కూడా ఈ చిత్రం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. ‘దంగల్’ పేరిట ఉన్న హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డును కూడా ‘దురంధర్-2’ బద్దలు కొట్టడం ఖాయం.