పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ అనుకున్న దాని కంటే వారం రోజుల ముందే ఉండబోతోంది. ఈ చిత్రాన్ని మార్చి 26 నుంచి 19కి ప్రిపోన్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ‘టాక్సిక్’ వాయిదా పడ్డ నేపథ్యంలో లభించిన అడ్వాంటేజీని ఉపయోగించుకోవాలని టీం నిర్ణయించింది.
ఈ నిర్ణయం అభిమానులను అమితానందానికి గురి చేస్తోంది. ఐతే ఈ సినిమాకు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు సస్పెన్సుగా మారింది. పవన్ సినిమా అంటే రేట్ల పెంపు కామన్.
తెలంగాణలో గత ఏడాది ప్రభుత్వం ఇకపై పెద్ద సినిమాలకు కూడా టికెట్ల ధరలు పెంచకూడదని గట్టి నిర్ణయం తీసుకుని, దానికే కట్టుబడి ఉన్న సమయంలోనూ ‘హరిహర వీరమల్లు’కు అవకాశమిచ్చారు. తర్వాత తిరిగి రేట్ల పెంపు అమల్లోకి వచ్చింది. కానీ ఆ సినిమాతో పాటు పలు చిత్రాలకు రేట్లు పెంచినపుడు కోర్టుల్లో కేసులు పడడం, ఇబ్బందులు తలెత్తడం తెలిసిందే.
ఐతే సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’కు రేట్లు పెంచడంపై సీరియస్ అయిన కోర్టు.. ఇకపై ఏ కొత్త సినిమాకు అదనపు రేట్లు ఇవ్వాలన్నా 90 రోజుల ముందే దరఖాస్తు చేయాలని, ప్రభుత్వమూ ఓకే చేయాలని స్పష్టం చేసింది. ఐతే అంత ముందుగా రిలీజ్ డేట్ ఖాయం చేసుకుని జీవో తెచ్చుకోవడం అంటే అసాధ్యమనే చెప్పాలి.
ఉస్తాద్ రిలీజ్ ఖరారైందే ఈ మధ్య. మళ్లీ ఇప్పుడు డేట్ మారింది కూడా. కాబట్టి కోర్టులో పోరాడి ఈ ఆదేశాలు మార్పించుకోవాల్సి ఉంది. లేదంటే ప్రభుత్వం రేట్ల పెంపు విషయంలో పూర్తిగా పాలసీనే మార్చాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇండస్ట్రీ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అవేవీ కొలిక్కి రాలేదు.
మరి ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఏం జరుగుతుందన్నది సస్పెన్సుగా మారింది. ప్రభుత్వ పాలనా పరంగా పవన్ నకు రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా సత్సంబంధాలు కలిగి ఉండడంతో ఏమైనా ప్రత్యేక సహకారం ఉండొచ్చనే చర్చ నడుస్తుంది.
‘హరిహర వీరమల్లు’ కోసం ఇలాగే చేశారు. కానీ తక్కువ టైంలో ఇది సాధ్యమా.. ‘ఉస్తాద్’కు రేట్ల పెంపు ఉంటుందా అన్నది సస్పెన్సుగానే ఉంది. ఏపీలో మాత్రం ఈ చిత్రానికి ఏ ఇబ్బందీ లేకుండా కోరినంత రేట్లు ఇచ్చేయడం లాంఛనమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates