త్రివిక్రమ్ ఉన్నట్టా లేనట్టా?

రీఎంట్రీలో జోరుమీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్తగా ఇంకో సినిమా మొదలుపెట్టేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఆయన కొత్త చిత్రం సోమవారమే మొదలైంది. అయ్యారె, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి చిన్న సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాగర్.కె.చంద్ర ఈ పెద్ద సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషమే. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి నటించనున్న సంగతి కూడా అధికారికంగా ఖరారైంది.

త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది. క్రిష్ సినిమాతో పాటే ఈ చిత్రంలోనూ పవన్ సమాంతరంగా నటిస్తాడని అంటున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా.. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రసాద్ మూరెళ్ల మళ్లీ పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నాడు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వీళ్లందరి పేర్లూ పోస్టర్ల మీద పడ్డాయి. ఐతే త్రివిక్రమ్ పేరు కూడా కనిపిస్తుందేమో అని చాలామంది ఆసక్తిగా చూశారు కానీ.. అదేమీ కనిపించలేదు. పవన్ ఈ సినిమా ఒప్పుకోవడంలో అత్యంత కీలక పాత్ర త్రివిక్రమ్‌దే అని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. సితార వాళ్లు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ హక్కులు తీసుకున్నాక లీడ్ ఆర్టిస్టుల ఎంపికలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. కానీ అనూహ్యంగా పవన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

సాగర్ లాంటి చిన్న దర్శకుడు ఈ చిత్రాన్ని టేకప్ చేయడం మరో షాక్. అతను పవన్‌ను హ్యాండిల్ చేయగలడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే తన వాళ్లయిన నిర్మాతల కోసం పవన్‌ను ఈ సినిమాకు ఒప్పించడమే కాక.. ఈ సినిమాకు రచన బాధ్యత కూడా త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. స్క్రిప్టు బాధ్యతంతా ఆయన చూసుకున్నాడు కాబట్టే పవన్ ధీమాగా ఈ సినిమా చేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడేమో పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. నిజంగా త్రివిక్రమ్ రచన చేస్తుంటే.. అది వెల్లడిస్తే సినిమాకు ఇంకా క్రేజ్ వస్తుంది. మరి ఎందుకా విషయాన్ని దాచి పెడుతున్నట్లో?