సొంత గడ్డపై విజయ్ రష్మిక వ్రతం

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తొలిసారి సొంతూరికి చేరుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మనపేటలోని తన ఫామ్ హౌస్‌లో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో వివాహం ముగిసిన అనంతరం నేరుగా గ్రామానికి రావడంతో స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు.

విజయ్ పుట్టి పెరిగిన తుమ్మనపేట అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి తర్వాత జరిపే ముఖ్యమైన పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో కాకుండా తన ఊరిలోనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో ఈ వేడుక జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తన చిన్ననాటి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. 

సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ తెచ్చుకున్నాక కూడా తన మూలాలను మర్చిపోకుండా ఇలా ఊరికి రావడం విశేషం. రష్మికతో కలిసి ఫామ్ హౌస్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ పేరుతోనే వీరు తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. 

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ ఆశీస్సులు అందుకున్న ఈ జంట, ఇప్పుడు సొంత గ్రామంలోని పెద్దల దీవెనలు తీసుకుంటున్నారు. వ్రతం కోసం ఫామ్ హౌస్‌ను సంప్రదాయబద్ధంగా అలంకరించారు. కేవలం సన్నిహితుల మధ్యే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, బయట అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఆ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు, బిగ్ సినీ స్టార్స్ రాబోతున్నారు.