ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే టాలీవుడ్ ఆస్కార్ తో సమానం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ పురస్కారాల కోసం తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్కరు పరితపించి పోయేవారు. హీరో హీరోయిన్ తో మొదలుపెట్టి కెమెరామెన్ దాకా ఇది గెలిచామంటే ఇంటా బయటా గర్వంగా చెప్పుకునే అచీవ్ మెంట్ లా ఉండేది.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే నంది అవార్డులను పునఃప్రారంభించే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంత గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న నంది అవార్డులను అవమానించడం ఎంత మాత్రం సబబు కాదు.
నిన్న జరిగిన సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని ఈవెంట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సీనియర్ హీరోయిన్ లయని ఉద్దేశించి మాట్లాడుతూ అప్పట్లో ఆవిడ నందులను పందుల్లా పెంచారని కితాబు ఇచ్చేశారు. నిజానికి ఒక్క క్షణం దానికర్థం అక్కడున్న వాళ్లకు తెలియలేదు.
మళ్లీ వంశీ నందిపాటినే మాట్లాడుతూ అప్పట్లో లయ పందులను పెంచుకున్నట్టు నంది అవార్డులు సాధించారని ఆ ఉద్దేశంతో అన్నానని చెప్పుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే లయకు నంది అవార్డు వచ్చింది మూడుసార్లే. స్వయంవరంకు స్పెషల్ జ్యురి, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రేమించు – మనోహరంకు గెలుచుకున్నారు. అంతే ఆవే ఆఖరు.
కౌంట్ ఎన్ని ఉన్నా, కారణం ఏదైనా నంది అవార్డులను పందులతో పోల్చడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఇంకా చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా భద్రం కొడుకోలో నటించిన లయకు నంది రాలేదు. అదే సినిమాలో మరో బాల నటుడు సంతోష్ రెడ్డి ఆ ఘనత సాధించాడు. అలాంటప్పుడు లయ ఇంటి నిండా నందులు ఉన్న రేంజ్ లో వంశీ నందిపాటి ఎలివేషన్ ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు.
ఆలా అయితే 19 సార్లు ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు అందుకున్న ఎస్పి బాలసుబ్రమణ్యంగారిని పొగడాల్సి వస్తే వంశీ ఇంకే ఉపమానం వాడతారో. ఇకనైనా స్టేజి మీద ప్రాసల కోసం గొప్ప విషయాలను చులకనగా మాట్లాడకపోవడం బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates