ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ అయిన ‘హనుమాన్’కు ఇది సీక్వెల్. ఐతే ‘హనుమాన్’ రిలీజైన వెంటనే పట్టాలెక్కుతుందనుకున్న ఈ చిత్రం.. ఇప్పటిదాకా సెట్స్ మీదికి వెళ్లలేదు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ వేరే ప్రాజెక్టుల పనిలో పడి దీన్ని పక్కన పెట్టేయడం.. ఇందులో హనుమంతుడి పాత్ర పోషించాల్సిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్-1’లో బిజీగా ఉండడంతో ఈ ఆలస్యం తప్పలేదు. ఐతే కొన్ని నెలల కిందట ప్రశాంత్, రిషబ్ ఇద్దరూ ఫ్రీ అయ్యారు. ‘జై హనుమాన్’ను ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి సీక్వెల్ మీద యుద్ధానికి సిద్ధమయ్యారు.

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ‘హనుమాన్’ను నిర్మించడమే కాక.. సీక్వెల్ కోసం ఖర్చు పెట్టిన తనను కాదని, ‘హనుమాన్-2’ను మైత్రీ వాళ్లకు ప్రశాంత్ చేస్తుండడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఫిలిం ఛాంబర్లో పోరాడుతున్నారు. ఈ గొడవపై ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి టైంలోనే ‘హనుమాన్’ ముహూర్త వేడుకను ఒక ప్రత్యేక ప్రదేశంలో చేసింది ప్రశాంత్ అండ్ టీం.

ఆదివారమే ‘జై హనుమాన్’ ముహూర్త వేడుక జరిగింది. కర్ణాటకలో ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రమైన హంపిలో ‘జై హనుమాన్’ ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. హంపికి సమీపంలో హనుమంతుడి జన్మస్థలంగా భక్తులు భావించే అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ టీం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాకు శ్రీకారం చుట్టింది. హనుమంతుడి మీద సినిమా తీయబోతూ.. ఆయన జన్మస్థలంలో ముహూర్త వేడుక నిర్వహించడం ప్రశంసలు అందుకుంటోంది.

రిషబ్ శెట్టి సొంత రాష్ట్రంలో ఈ వేడుక జరగడం అతడికి, తన అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చేదే. ‘కాంతార’, ‘కాంతార: చాప్టర్-1’ చిత్రాలతో రిషబ్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఒక రేంజిలో ఉంది. ‘హనుమాన్’తో ప్రశాంత్ మంచి గుర్తింపు సంపాదించాడు. వీళ్లిద్దరి కలయికలో హనుమంతుడి మీద సినిమా వస్తే మినిమం వెయ్యి కోట్ల వసూళ్లు గ్యారెంటీ అన్నది ట్రేడ్ వర్గాల మాట. ఐతే ఈ సినిమా షూట్ మొదలవడానికి ముందు ‘హనుమాన్’ నిర్మాతతో పంచాయితీని ప్రశాంత్ పరిష్కరించుకోవాల్సిన అవసరముంది.