24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. ప్రత్యూషతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన సిద్దార్థరెడ్డికి హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ, అతణ్ని వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
విదేశాల్లో ఉన్న సిద్దార్థ రెడ్డి ఇంకొన్ని రోజుల్లోనే లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. తన కూతురి మరణం విషయంలో 24 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రత్యూష తల్లి సరోజినీ దేవి.. తాజాగా ఈ తీర్పుపై స్పందించారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాను అని చెబుతూనే.. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, ఈ తీర్పుతో ప్రత్యూష ఆత్మ శాంతించదని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడేంత పిరికిది కాదని, ఆమె ఎంతో ధైర్యవంతురాలని.. తనను అలాగే పెంచానని మొదటినుంచి చెబుతున్న మాటలనే ఆమె మరోసారి స్పష్టం చేశారు.
చనిపోవడానికి ముందు ప్రత్యూషపై లైంగిక దాడి జరిగిందని, ఆమె గొంతు నొక్కి బలవంతంగా పురుగుల మందు తాగించారని.. ఈ ఆరోపణలకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని సరోజినీ దేవి స్పష్టం చేశారు.
ప్రత్యూష మరణానంతం గాంధీ ఆసుపత్రిలో మునిస్వామి అనే వైద్యుడు పోస్టుమార్టం నిర్వహించారని.. నేరుగా బాడీని చూసి ఆయన ఇచ్చిన నివేదికను ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోలేదని.. ప్రత్యూష మరణించిన నెల తర్వాత ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ కేసులో తీర్పు వచ్చిందని.. మునిస్వామి ఇచ్చిన నివేదిక కాకుండా, ప్రత్యూష బాడీని నేరుగా చూడని కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకోవడం ఎలా సమంజసమని ఆమె ప్రశ్నించారు.
సిద్దార్థ రెడ్డికి జీవిత ఖైదు పడాలని తాను 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని.. కనీసం ముందు విధించిన ఐదేళ్ల జైలు శిక్ష అయినా ఖరారవుతుందని అనుకున్నానని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తనకు ఆవేదనకు గురి చేస్తోందని.. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తానని ఆమె అన్నారు. తదుపరి ఏం చేయాలన్నది తనకు తెలియదని.. జడ్జిమెంట్ కాపీ వచ్చాక, తమ అడ్వకేట్తో మాట్లాడి ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటామని సరోజినీ దేవి పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates