క్లైమాక్స్ మార్చి మంచి పని చేశారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమాగా ‘అరవింద సమేత’ను చెప్పొచ్చు. ఎక్కువగా సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీసే త్రివిక్రమ్.. చాలా సీరియస్‌ కథతో ఈ సినిమా చేశాడు. ఆ సినిమాలో కనిపించే ఇంటెన్సిటీ.. త్రివిక్రమ్ మరే చిత్రంలోనూ చూడలేం.

‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తర్వాత తనకు తాను ఒక మేకోవర్ ఇచ్చుకుని ఈ సినిమా చేశాడు త్రివిక్రమ్. కథాకథనాలు.. పాత్రల చిత్రణ.. డైలాగులు.. అన్నీ భిన్నంగా, ఒక తీవ్రతతో ఉంటాయి. ఐతే ఈ సినిమా క్లైమాక్స్ తెర మీద ప్రేక్షకులు చూసినట్లుగా మొదట లేదట. ఇందులో విలన్ పాత్ర పోషించిన జగపతిబాబు సలహా మేరకే మార్చాడట త్రివిక్రమ్. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడీ సీనియర్ నటుడు.

‘‘అరవింద సమేత సినిమా అదరగొట్టాడు త్రివిక్రమ్. నాకు ఆ సినిమాతో వచ్చిన ప్రోత్సాహం చాలా ప్రత్యేకమైంది. కెమెరామన్ పేరు మర్చిపోయా కానీ.. ఆయన (పీఎస్ వినోద్) నా ఫ్రేమ్ వచ్చినపుడల్లా ఎగ్జైట్ అయిపోయేవారు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చేది. ఇంకా ఇంకా రెచ్చిపోవడం జరిగింది.

క్లైమాక్స్ కూడా భలే మార్చాడు త్రివిక్రమ్. ముందు ఒక క్లైమాక్స్ చేశాం. రెగ్యులర్‌గా 40 మంది రౌడీలు రావడం.. అందులో ఒకరిని కొడితే.. రేయ్ అంటూ ఇంకో ఇద్దరు రావడంతో.. ఈ చెత్తంతా తీశాం. కానీ అంతా అయిపోయాక ఒక బ్రేక్ వచ్చింది. అప్పుడు త్రివిక్రమ్‌తో అన్నా.. ‘ఏంటి శీను నువ్వు కూడా ఈ రొటీన్ గా తీస్తున్నావు, బోర్ కొడుతోందయ్యా.. నీలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు కూడా ఇలా తీస్తే ఎలా? కొత్తగా ట్రై చేయొచ్చు కదా’ అని.

అప్పటికే వాళ్లకు ఏదో కొడుతోంది. ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. నేను అలా చెప్పడంతో ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లతో మాట్లాడి మళ్లీ వేరే క్లైమాక్స్ రాసి తీశాడు శీను’’ అని జగపతిబాబు వెల్లడించాడు. ఇప్పుడు సినిమాలో ఉన్న క్లైమాక్స్‌లో విలన్‌తో పాటు ఉన్న మనుషులందరూ మారిపోతే, అతను హీరోతో ఒక్కడే తలపడతాడు. విలన్ని చంపి ఊర్లోకి వచ్చిన హీరో.. ఆడవాళ్లకు అధికారం ఇద్దామని స్పీచ్ ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.