పార్ట్ 2 కోసం డైరెక్టర్ రెడీనే కానీ..

కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు వాటి విలువ తెలియదు. ఆడాల్సినంతగా ఆడవు. కానీ కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. తమిళంలో ‘ఆయురత్తిల్ ఒరువన్’ పేరుతో తెరకెక్కి, తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో రిలీజైన కార్తి సినిమా కూడా అలాంటిదే.

తమిళ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కార్తి కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి, విస్మయపరిచే కథ, కళ్లు చెదిరే విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందించాడు సెల్వ. 

ఐతే ఈ సినిమా అప్పట్లో ఓ మోస్తరుగా ఆడిందంతే. ముఖ్యంగా తెలుగులో ఆడినంతగా తమిళంలో ఈ చిత్రం ఆడలేదు. ఐతే టీవీల్లోకి వచ్చాక ఈ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. దీని సీక్వెల్ గురించి దశాబ్దం కిందట్నుంచే చర్చ జరుగుతోంది. కానీ ఎంతకీ అది పట్టాలెక్కడం లేదు. కొన్నేళ్ల ముందు ధనుష్ హీరోగా ‘ఆయురత్తిల్ ఒరువన్-2’ను ప్రకటించినపుడు అందరూ షాకయ్యారు. కార్తి లేకుండా ఈ సీక్వెల్ ఏంటి అనుకున్నారు. 

కానీ ధనుష్‌తో కూడా ఈ సినిమా తీయలేదు సెల్వ. మరి ఈ సినిమా ఏమైంది.. ఎందుకు ముందుకు కదలట్లేదు అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సెల్వను అడిగితే.. ఈ సీక్వెల్ చేయడానికి తాను ఎప్పుడో రెడీ అని చెప్పాడు. స్క్రిప్టు కూడా రెడీ అయిందన్నాడు. కానీ దర్శకుడు ఒక్కడు సిద్ధంగా ఉంటే సరిపోతుందా అని అతను ప్రశ్నించాడు. 

సినిమా అంటే అనేకమంది కలిసి చేయాల్సిన ప్రయాణం అని.. కెప్టెన్ సిద్ధంగా ఉన్నా, మిగతా వాళ్లు రెడీగా లేరని.. మరి తానొక్కడిని షిప్పును నడిపించగలనా అని ప్రశ్నించాడు. దీన్ని బట్టి హీరో కార్తి కానీ, నిర్మాత కానీ ఈ సినిమా చేయడానికి రెడీగా లేరనిపిస్తోంది.

సెల్వ మంచి హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. అందుకే ధనుష్‌తో ఈ సినిమా చేయడానికి కూడా ఇబ్బందులున్నట్లు కనిపిస్తోంది. మరి ‘7/జి బృందావన కాలనీ-2’తో అయినా సక్సెస్ సాధించి, ఈ కల్ట్ సీక్వెల్‌ను సెల్వ పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.