బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఇప్పుడు ఒక కొత్త టెన్షన్లో పడ్డారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలాంటి ఆపద వస్తుందో అనేలా వాతావరణం కనిపిస్తోందని నార్త్ మీడియాలో సౌండ్ పెరుగుతోంది. ఇక కెరీర్ పరంగా ఫుల్ ఫామ్లో ఉన్న రణవీర్, తను నటించిన ‘ధురంధర్’ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్లో ఉండాల్సింది పోయి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ముంబైలోని ఆయన నివాసం దగ్గర ఇప్పుడు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల పహారా పెరిగింది. ఈ మార్పులు చూస్తుంటే బి టౌన్ లో ఏదో గట్టిగానే జరుగుతోందని అర్థమవుతోంది.
నిజానికి గత కొద్ది రోజులుగా ముంబైలో సినిమా సెలబ్రిటీల భద్రత అనేది హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా ఫేమస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగిన ఘటన మరువక ముందే రణవీర్ సింగ్కు బెదిరింపులు రావడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి లోతైన విచారణ మొదలుపెట్టారు.
ఇటీవల రణవీర్ సింగ్కు వాట్సాప్ ద్వారా ఒక వాయిస్ నోట్ రూపంలో బెదిరింపులు వచ్చాయి. అందులో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కోట్లాది రూపాయల డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రణవీర్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆయన ఉండే బిల్డింగ్ దగ్గర భద్రతను ఒక్కసారిగా పెంచేశారు.
అయితే ఈ సెక్యూరిటీ ఏర్పాట్ల వల్ల రణవీర్ ఉండే సొసైటీలోని ఇతర సభ్యులకు కొత్త తలనొప్పి మొదలైంది. బిల్డింగ్ లాబీ, జిమ్, పిల్లలు ఆడుకునే ఏరియాల్లో తుపాకులతో తిరుగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల వల్ల తమకు ఇబ్బందిగా ఉందని సొసైటీ మేనేజింగ్ కమిటీ పోలీసులకు లేఖ రాసింది. కేవలం రణవీర్ సేఫ్టీ కోసం బిల్డింగ్ మొత్తం ఇలా ఆయుధాలతో పహారా కాయడం వల్ల రెసిడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని వారు పోలీసులను కోరారు.
రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనకు, రణవీర్కు వచ్చిన ఈ వాయిస్ నోట్కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభం లోంకర్ బాధ్యత వహించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రణవీర్ను కూడా టార్గెట్ చేయడం వెనుక ఉన్నది వారేనా లేక ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినా, అసలు నిందితుల కోసం వేట కొనసాగుతోంది.
డబ్బుల కోసం స్టార్ హీరోలను టార్గెట్ చేసే సంస్కృతి బాలీవుడ్లో మళ్ళీ మొదలవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ధురంధర్ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉండాల్సిన రణవీర్, ఇప్పుడు ఇలాంటి సెక్యూరిటీ సమస్యలతో సతమతమవుతున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ వాయిస్ నోట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates