ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు. కానీ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ చివ‌రి సినిమా కూలీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల‌నూ తీవ్ర నిరాశ‌కు గురి చేసిన మాట వాస్త‌వం. కాంబినేష‌న్ క్రేజ్, ప్రోమోలు చూసి ఏదో అనుకుంటే.. తెర మీద ఇంకేదో బొమ్మ చూపించాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్.

రిలీజైన‌పుడు, త‌ర్వాత దీని మీద విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు స్వ‌యంగా ర‌జినీకాంత్ చిన్న‌ కూతురు సౌంద‌ర్యనే ఆ సినిమా ప‌ట్ల ఒకింత అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఆ సినిమా న‌చ్చినా స‌రే.. త‌న తండ్రి ఫేవ‌రెట్ ఫిలిమ్స్‌లో ఒక‌టిగా చెప్ప‌లేన‌ని.. ఆ సినిమా నుంచి తాను ఇంకా ఎక్కువ ఆశించాన‌ని ఆమె వ్యాఖ్యానించింది.

ప్ర‌ముఖ త‌మిళ క్రిటిక్ భ‌ర‌ద్వాజ్ రంగ‌న్.. తాజాగా సౌంద‌ర్య‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా తన‌కు కూలీ సినిమా న‌చ్చింద‌ని, ఆ విష‌యాన్నే రివ్యూలో చెబితే చాలామంది తీవ్రంగా విమ‌ర్శించార‌ని భ‌ర‌ద్వాజ్ రంగ‌న్ వెల్ల‌డించారు. ఇంత‌కీ ఈ సినిమాపై మీ ఉద్దేశ‌మేంటి అని అడిగితే..

ఆ సినిమా కొంత వ‌ర‌కు త‌న‌కు న‌చ్చింద‌ని, ముఖ్యంగా డీఏజీయింగ్ ఎఫెక్ట్ వాడి ర‌జినీని యుక్త వ‌య‌స్కుడిగా చూపించిన ఎపిసోడ్‌ను తాను బాగా ఆస్వాదించానిన చెప్పింది సౌంద‌ర్య‌. కానీ ర‌జినీ బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా దీన్ని తాను పేర్కొన‌లేన‌ని చెప్పింది. సినిమా నుంచి ఇంకా చాలా ఆశించాన‌ని సౌంద‌ర్య వెల్ల‌డించింది. 

ఐతే ఈ సినిమా గురించి ఇంత‌కుమించి తాను మాట్లాడ‌లేన‌ని, ఎందుకంటే ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ మీద త‌న‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని సౌంద‌ర్య పేర్కొంది. గ‌తంలో సౌంద‌ర్య త‌న తండ్రిని లీడ్ రోల్‌లో పెట్టి కోచ్చ‌డ‌యాన్ అనే యానిమేష‌న్ మూవీ తీసింది. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయింది.

ఆ త‌ర్వాత ఆమె త‌న మాజీ భర్త ధ‌నుష్ హీరోగా వీఐపీ-2 తీసింది. ప్ర‌స్తుతం ఆమె ప్రొడ్యూస్ చేసిన విత్ ల‌వ్ మూవీ ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గ‌త ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు అభిషాన్ జీవింత్ ఇందులో హీరోగా న‌టించాడు. మ‌ల‌యాళ అమ్మాయి అన‌స్వ‌ర రాజ‌న్ క‌థానాయిక‌గా చేసింది.