నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు.
టీ నగర్ ఆలయం సమీపంలో ఆమెకు దొరికిన 45 తులాల బంగారాన్ని ఏమాత్రం ఆలోచించకుండా అధికారులకు అందించిన పద్ధతి అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె గొప్ప మనసును గుర్తించిన సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.
తన నిజాయితీతో అందరినీ ఇన్స్పైర్ చేసిన పద్మను రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకొని అభినందించారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆమెకు ఒక బంగారు గొలుసును బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. పద్మ చేసిన పనికి సూపర్ స్టార్ ఫిదా అయిపోయి, ఆమెతో కలిసి ఫోటోలు దిగి తన సంతోషాన్ని పంచుకున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి సామాన్యులను గుర్తించి అభినందించడం నిజంగా గ్రేట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రజినీకాంత్ పద్మకు కేవలం గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా, ఆమెకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆమెకు ప్రతి నెలా రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తానని సూపర్ స్టార్ హామీ ఇచ్చారట. సామాన్య కార్మికురాలిగా పని చేస్తూ ఇంతటి నిజాయితీని ప్రదర్శించిన ఆమెకు ఈ సాయం ఒక గొప్ప ఊరట అని చెప్పొచ్చు. ఇలాంటి రివార్డులు నిజాయితీగా ఉండే మరికొంతమందికి స్ఫూర్తినిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
పద్మ చేసిన ఈ పనిపై గతంలోనే సోషల్ మీడియాలో స్థానిక పోలీసుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. కష్టపడి పని చేసే తత్వం, ఎదుటివారి వస్తువులపై ఆశ పడని గుణం ఉన్న పద్మను సూపర్ స్టార్ స్వయంగా పిలిచి గౌరవించడం ఆమె నిజాయితీకి దక్కిన అసలైన గౌరవం. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం డబ్బు వెనక పరుగులు తీయకుండా, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తే సమాజంలో గుర్తింపు ఎలా వస్తుందో పద్మ లైఫ్ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates