షారుఖ్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు

బాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు ఖాన్ త్రయమే ఆధిపత్యం చలాయించింది. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య నంబర్ వన్ స్థానం కోసం కుర్చీలాట నడిచింది. ఒక్కో ఫేజ్‌లో ఒక్కొక్కరు పైచేయి సాధించారు. రికార్డులు ఈ ముగ్గురి చుట్టూనే తిరిగేవి. హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ లాంటి నవతరం స్టార్ల నుంచి పోటీ ఎదురైనా.. వీరి ఆధిపత్యానికి ఢోకా లేకపోయింది.

ఐతే కొన్నేళ్ల ముందు ఖాన్ త్రయం పనైపోయింది అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్.. బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పఠాన్, జవాన్ చిత్రాలతో సత్తా చాటాడు. అవి రెండూ వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును దాటాయి. దీంతో షారుఖ్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.

అంతకుముందు ‘బాహుబలి’తో ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదగడాన్ని తట్టుకోలేకపోయిన షారుఖ్ ఫ్యాన్స్.. పఠాన్, జవాన్‌ల సక్సెస్‌తో టాలీవుడ్ స్టార్ మీద ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ‘స్పిరిట్’ సినిమా గ్లింప్స్‌లో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని ప్రభాస్‌కు ట్యాగ్ ఇవ్వడం మీద కూడా వాళ్లు మండిపడ్డారు. షారుఖే ఇప్పటికే టాప్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేశారు.

కట్ చేస్తే ఇప్పుడు షారుఖ్ ఫ్యాన్స్.. బాలీవుడ్‌కే చెందిన రణ్వీర్ సింగ్‌‌ను టార్గెట్ చేసుకున్నారు. అతడి కొత్త చిత్రం ‘దురంధర్’ రికార్డ్ బ్రేకింగ్ హిట్టయిన సంగతి తెలిసిందే. ‘జవాన్’ సహా అన్ని హిందీ చిత్రాల డొమెస్టిక్ వసూళ్ల రికార్డులను అది దాటేసింది. ఇది షారుఖ్ అభిమానులకు జీర్ణం కావడం లేదు.

దీంతో ‘దురంధర్’ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘దురంధర్’ కంటే ‘జవాన్’ ఫుట్ ఫాల్స్ ఎక్కువ అని.. ఇప్పుడున్న టికెట్ల ధరలు అప్పుడు ఉండుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవని.. ఆ రకంగా చూస్తే ఇండియాలో అదే బిగ్గెస్ట్ హిట్ అని అదే పనిగా పోస్టులు పెడుతున్నారు.

షారుఖ్ పీఆర్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి టెంప్లేట్ ట్వీట్లు, పోస్టులు వేయిస్తున్నాయి. ఇంతకుముందు సౌత్ హీరో కాబట్టి ప్రభాస్‌ను టార్గెట్ చేశారు కానీ.. ఇప్పుడు తోటి బాలీవుడ్ హీరో అయిన రణ్వీర్ రికార్డును అందుకున్నా షారుఖ్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోవడం, నిఖార్సయిన ఒక హిట్‌ను తగ్గించే ప్రయత్నం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.