క్రేజ్‍ని కోట్లు చేసుకుంటోన్న సాయి పల్లవి

సాయి పల్లవి ఒక సినిమా సైన్‍ చేయాలంటే అంత ఆషామాషీ విషయం కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆ పద్ధతిని ఆమె మార్చేసుకుందట. వచ్చిన ప్రతి అవకాశాన్నీ జారవిడుచుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గ్రహించిన సాయి పల్లవి ఇప్పుడు పాత్రల ఎంపికలో పట్టు విడుపులు చూపిస్తోందట. అయితే తనకున్న డిమాండ్‍ ఎలాంటిది, ఇండస్ట్రీలో తాను మాత్రమే చేయగల పాత్రలు ఎన్ని వున్నాయనేది ఆమె కనిపెట్టేసిందట. అందుకే నిర్మాతలు తనను అప్రోచ్‍ అయితే చేయనని చెప్పకుండా భారీ పారితోషికం డిమాండ్‍ చేస్తోందట.

సినిమాలో తన పాత్ర నిడివి ఎంత, ఎన్ని రోజులు పని చేయాలనేది కాకుండా తనకింత కావాలంటూ నిర్మొహమాటంగా చెబుతోందట. అంత పారితోషికం ఇవ్వగలిగిన వాళ్లకే ఆమె డేట్స్ ఇస్తోందట. తెలుగు సినిమాల్లో స్టార్‍ హీరోలు నటించే వాటిలో ఎక్కువగా గ్లామర్‍ ప్రధాన హీరోయిన్‍ పాత్రలే వుంటాయి. అలాంటివాటికి సాయి పల్లవిని ఎలాగో అప్రోచ్‍ అవలేరు. కానీ నటిగా తాను మాత్రమే చేయగల పాత్రలయితే వుంటూనే వుంటాయి. అందుకే ఆ స్పేస్‍లో ఎక్కువ మంది లేని లోటుని ఆమె ఫుల్‍గా క్యాష్‍ చేసుకుంటోందని టాలీవుడ్‍లో వినిపిస్తోన్న టాక్‍.