తారక్ ఫ్యాన్స్ హ్యాపీ… బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా బావా అని సంబోధించుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే అభిమానులు కూడా ఫ్రెండ్లీగా మెలుగుతుంటారు సోషల్ మీడియాలో. కానీ అప్పుడప్పుడు మాత్రం పెద్ద కారణం లేకుండానే కొట్టేసుకుంటూ ఉంటారు. వారు ఫ్యాన్ వార్స్ చేసుకోవడానికి బలమైన కారణమే దొరికింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సుబ్రహ్మణ్య స్వామి సినిమాను వీళ్లిద్దరిలో ఎవరు చేస్తారనే విషయంలో తలెత్తిన గందరగోళమే అందుక్కారణం. ముందు బన్నీతో ఈ సినిమాను అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ బన్నీ.. అట్లీ మూవీ మీదికి వెళ్లిపోవడంతో ఈ ప్రాజెక్టు తారక్ దగ్గరికి వచ్చింది. కానీ ఈ మధ్య ఈ మూవీ తిరిగి బన్నీ దగ్గరికి వచ్చినట్లుగా ప్రచారం జరగడంతో తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారు. బన్నీ అభిమానులు కూడా సై అంటే సై అంటూ వారితో తలపడ్డారు.

ఐతే ఈ సస్పెన్సుకు ఎట్టకేలకు తెరపడింది. అట్లీ మూవీ తర్వాత అల్లు అర్జున్.. లోకేష్ కనకరాజ్‌తో సినిమాను ఓకే చేయడంతో.. సుబ్రహ్మణ్యస్వామి ప్రాజెక్టును తారకే చేయబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. లోకేష్ చివరి చిత్రాలు ఫ్లాప్ అయినా సరే.. అతను బన్నీతో సినిమా చేయబోతుండడం పట్ల అభిమానులు సంతృప్తిగానే ఉన్నారు. లోకేష్ ఈసారి జాగ్రత్తగా సినిమా తీస్తాడని.. బన్నీని సూపర్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసి బ్లాక్ బస్టర్ కొడతాడని ధీమాగా ఉన్నారు.

త్రివిక్రమ్ సినిమా చేజారిందనేమీ వారిలో ఫీలింగ్ కనిపించడం లేదు. మరోవైపు సుబ్రహ్మణ్యస్వామి కథకు తారకే పర్ఫెక్ట్ ఛాయిస్ అని.. ఈ తరం హీరోల్లో మైథాలజీ కథతో మెప్పించగల ఏకైక హీరో తనే అని.. ఈసారి త్రివిక్రమ్‌తో కలిసి తారక్ పాన్ ఇండియా స్థాయిలో తారక్ భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని నందమూరి అభిమానులు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. మొత్తానికి వైరం పక్కన పెట్టేసి తారక్, బన్నీ ఫ్యాన్స్ మళ్లీ కలిసిపోబోతున్నట్లే.