రక్షణ మంత్రి చేతికి సినిమా స్క్రిప్టు

బాలీవుడ్ కాంట్రవర్శల్ క్వీన్ కంగనా రనౌత్ కొన్నేళ్లుగా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. హిందీలో ‘క్వీన్’ దగ్గర్నుంచి ఆమె ఈ టైపు సినిమాల్లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఆమె నుంచి రివాల్వర్ రాణి, సిమ్రన్, మణికర్ణిక లాంటి సినిమాలొచ్చాయి. ‘మణికర్ణిక’తో ఆమె బాక్సాఫీస్ పవర్ ఏంటో కూడా అందరికీ తెలిసింది. దాని తర్వాత దక్షిణాదిన జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ సినిమా చేసింది. దీని తర్వాత ఆమె ఇటీవలే ‘తేజస్’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘తేజస్’ ఇండియ‌న్ నేవీ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. యుద్ధాల స‌మ‌యంలో నేవీ సిబ్బంది చూపే ధైర్య సాహ‌సాల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది. స‌ర్వేష్ మేవారా అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నుండ‌గా.. రోనీ స్క్రూవాలా యురి త‌ర్వాత నిర్మిస్తున్న చిత్ర‌మిది. కంగ‌నాది ఏదైనా నిజ జీవిత పాత్రా అన్న‌ది తెలియ‌ట్లేదు. ఐతే ఆమె ఓ సాహ‌స మ‌హిళ పాత్ర‌లో అయితే క‌నిపించ‌బోతోంద‌ని దీని ఫ‌స్ట్ లుక్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు కంగనా అండ్ టీమ్ వెళ్లి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడం విశేషం.

డిఫెన్స్, నేవీ నేపథ్యంలో సినిమాలు ఎలా పడితే అలా తీసేస్తుండటంతో ఈ మధ్య ఆ విభాగాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్గిల్ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో తీసిన ‘గుంజన్ సక్సేనా’ విషయంలో ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో తర్వాత వివాదాలు ఎందుకని ఇప్పుడే క్లియరెన్స్ తెచ్చుకుంది కంగన బృందం. రాజ్‌నాథ్‌ను కలిసి ఆయన చేతిలో ‘తేజస్’ స్క్రిప్టును పెట్టేసింది కంగనా. ఈ మధ్య మోడీ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయిన కంగనాకు అక్కడి నుంచి క్లియరెన్స్ రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు.