హమ్మయ్య.. మెగా మూవీ కదలబోతోంది


కమల్ హాసన్, శంకర్‌ల కాంబినేషన్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడమే కాదు.. జనాల ఆలోచనల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీని సీక్వెల్ గురించి తర్వాతి కాలంలో అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి ‘భారతీయుడు’ వచ్చిన 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌ను మొదలుపెట్టి ఈ సినిమాను అభిమానించేవారిని అమితానందంలో ముంచెత్తాడు శంకర్.

ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో కానీ.. నాటి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. చివరగా సెట్స్‌లో జరిగిన ప్రమాదం వల్ల బ్రేక్ పడగా.. ఆ తర్వాత కరోనా సినిమాకు అడ్డం పడింది. ఐతే కరోనా అనంతరం అందరూ షూటింగ్ మొదలుపెట్టినా ఈ సినిమా మాత్రం ముందుకు కదల్లేదు.

దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య బడ్జెట్, ఇతర విషయాల్లో విభేదాలే ‘ఇండియన్-2’ ముందుకు కదలకపోవడానికి కారణం. ఐతే ఎట్టకేలకు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయటయ. వారి మధ్య విభేదాలు తొలగిపోయాయట. సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం అవుతుందని సమాచారం.

ఇంకా ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోయేసరికి కమల్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఆయన అందుబాటులోకి వస్తారని ‘ఇండియన్-2’ బృందం ఆశిస్తోంది. ఒక దశలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. అవి తొలగిపోయి ఈ మెగా మూవీ ముందుకు కదలబోతుండటం కమల్, శంకర్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.