దాదాపు ఏడాది కిందట విడుదలైన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద.. జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రస్తుతం ఇంకా వైద్యం పొందుతున్నాడు. ఇక, ఈ కేసు అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని.. తీవ్రంగా కుదిపేసింది. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ సహా.. సినిమా ధియేటర్ యాజమాన్యం పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకానొక దశలో అల్లు అర్జున్ అరెస్టు కూడా అయ్యారు. వెంటనే బయటకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఏడాది తర్వాత పోలీసులు పుష్ప-2 మూవీ తొక్కిసలాట ఘటనపై చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో అక్యూజ్డ్-11గా హీరో అల్లు అర్జున్ పేరును కూడా చేర్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా పోలీసులు చార్జిషీట్లో వివరించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు స్థానిక కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు.
చార్జిషీట్లో ఏముందంటే..
పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో పలు వివరాలు వెల్లడించారు. అల్లు అర్జున్ వస్తున్నట్టు సంధ్య ధియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఉందని అయితే.. సరైన భద్రతా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. `విషయం తెలిసినా.. లైట్గా వ్యవహరించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకులను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పోలీసులకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు“ అని చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంధ్యా ధియేటర్ యాజమాన్యాన్ని ఏ-1గా ఈ కేసులో పేర్కొన్నారు.
ఇక, హీరో అల్లు అర్జున్ మేనేజర్లు కూడా.. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. అందుకే ఈ తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మేనేజర్లపైనా కేసులు నమోదు చేశారు. అలానే.. పోలీసులను బెదిరించడంతో పాటు ప్రేక్షకులను కూడా తోసేసిన ఆరోపణలు ఉన్న అర్జున్ బౌన్సర్లు 8 మందిని కూడా కేసులో పేర్కొన్నారు. ఇక, ఏ 11గా అర్జున్ పేరును ప్రస్తావించారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరపనుంది.
ఆరోజు ఏం జరిగింది?
2024 డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల సమయంలో పుష్ప-2 బెనిఫిట్ ప్రదర్శించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉన్న సంధ్య ధియేటర్కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇదేసమయంలో అనూహ్యంగా అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఆయన రోడ్ షో నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి కూడా.. సంధ్యా యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోకపోగా.. పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఓ మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాడు. మరింత మంది బాధితులుగా మిగిలారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates