స్టేజ్ మీద చిన్న మాట తూలితేనే ఈ రోజుల్లో పెద్ద వివాదాలుగా మారిపోతున్నాయి. అలాంటిది నటుడు శివాజీ నిన్నటి ‘దండోరా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చాలా వివాదాస్పదమైన కామెంట్లే చేశారు. మహిళల వస్త్రధారణ గురించి ఆయన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి.
“మీ అందం చీరలోనో.. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనో ఉంటాది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఉండదమ్మా”.. ‘‘దరిద్రం ముండ..ఇలాంటి బట్టలేసుకున్నావు ఎందుకు.. కొంచెం మంచి బట్టలేసుకోవచ్చు బావుంటావు కదా అని అనాలనిపిస్తుంది లోపల. అనలేం’’.. ఇలా శివాజీ హద్దులు దాటి మాట్లాడేశారు. తన కామెంట్లను ఎవరైనా తప్పుబట్టినా తాను డీల్ చేసుకోగలనన్నట్లుగా ఆయన మాట్లాడారు. శివాజీ వీడియోలు బయటికి రాగానే దీని మీద పెద్ద వివాదం రాజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.
సోషల్ మీడియాలో మహిళలు, వారి మద్దతుదారులు శివాజీ కామెంట్ల మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. అందులో పలువురు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. శివాజీ కామెంట్ల తాలూకు వీడియోను షేర్ చేస్తూ చిన్మయి ఒక పోస్టు పెట్టింది. మహిళలను ‘దరిద్రపు ముండ’ అని సంబోధించడం, సామాన్లు అనే పదం వాడడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివాజీ ఒక మంచి సినిమాలో విలన్ పాత్ర చేశాడని.. ఇప్పుడు విపరీత మనస్తత్వం ఉన్న అబ్బాయిలకు ఆయన హీరోగా మారాడని ఆమె కామెంట్ చేసింది.
తన సినిమా ఈవెంట్కు జీన్స్, హుడీ వేసుకుని వచ్చిన శివాజీ ధోతీ ఎందుకు కట్టుకోలేదని ఆమె ప్రశ్నించారు. మరోవైపు అనసూయ భరద్వాజ్ నేరుగా శివాజీ మీద ఏ కామెంట్ చేయలేదు కానీ.. ‘‘ఇది నా శరీరం మీది కాదు’’ అనే కోట్ను పంచుకోవడం ద్వారా ఆయనకు కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఎంతోమంది శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన కామెంట్స్ కరెక్టే అంటూ సమర్థిస్తున్న వాళ్లూ లేకపోలేదు. సోషల్ మీడియా రచ్చ చూస్తే తన కామెంట్లకు శివాజీ సారీ చెప్పక తప్పేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates