చిరంజీవి ఇంట్లో బాధాకర పరిస్థితి

2020లో అనేక సినీ కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి. వాటిలో కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణం కూడా ఒకటి. సీనియర్ హీరో అర్జున్‌కు మేనల్లుడైన చిరంజీవి.. కొన్ని నెలల కిందట హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నటి మేఘన రాజ్‌ను పెళ్లి చేసుకుని రెండేళ్లు కూడా కాకముందే అతను ఇలా అర్ధంతరంగా చనిపోవడం అందరిలోనూ విషాదం నింపింది. చిరంజీవి చనిపోయే సమయానికి మేఘన నిండు గర్భిణి కావడం గమనార్హం. ఇటీవలే ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సందర్భంగా చిరంజీవి కటౌట్‌ను పక్కన పెట్టుకుని బేబీ షవర్ వేడుక నిర్వహించడం తెలిసిన సంగతే.

ఇప్పుడు వారి కుటుంబంలో బాధాకర పరిస్థితి నెలకొంది. మేఘనతో పాటు ఆమె కొడుకు.. అలాగే మేఘన తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనే స్వయంగా వెల్లడించింది.

‘‘అవును.. నాతో పాటు మా అబ్బాయి, మా తల్లిదండ్రులకు కరోనా సోకిందని వెల్లడైంది. కానీ మేం ఈ సమయంలో ధైైర్యంగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలనుకుంటున్నాం. దీనికి ఎంతమాత్రం భయపడటం లేదు. ఈ పరిస్థితిని సులువుగా అధిగమిస్తామని అనుకుంటున్నా’’ అని మేఘన తెలిపింది.

చిరంజీవి మరణం తాలూకు విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలో మేఘన కుటుంబంలో అందరికీ కరోనా సోకడం అభిమానుల్ని కలవరపెడుతోంది. మళ్లీ ఈ కుటుంబానికి ఈ కష్టమేంటని బాధ పడుతున్నారు. మేఘన తల్లిదండ్రులు వయసు మళ్లిన వాళ్లు కావడంతో వారికేం కాకూడదని కోరుకుంటున్నారు. నెలల బిడ్డకు కరోనా సోకడం పట్ల కూడా అయ్యో అనుకుంటున్నారు. మేఘన కుటుంబ వైద్యులు దగ్గరుండి వీరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్లంతా ఆసుపత్రిలో చేరబోతున్నట్లు సమాచారం.