నాగ్‌ను ఇరిటేట్ చేసిన యాపిల్ కంపెనీ


మొబైల్ బ్రాండ్స్‌లో యాపిల్‌కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఆ సంస్థ నుంచి వచ్చే ఐ ఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజే వేరు. హై ప్రొఫైల్ పీపుల్ అంతా దాని వైపే మొగ్గు చూపుతారు. మిగతా మొబైల్స్‌ను హ్యాక్ చేసినంత ఈజీగా యాపిల్ ఐఫోన్లను హ్యాక్ చేయడం సాధ్యం కాకపోవడమే అందుక్కారణం. ఫీచర్స్ వేరే ఫోన్లకు మించి ఏమీ ఉండవు కానీ.. సెక్యూరిటీ కారణాలతోనే ఐఫోన్ వైపు మొగ్గు చూపుతారు సెలబ్రెటీలు.

ఏదైనా ఇన్వెస్టిగేషన్ కోసం అడిగినా సరే.. యాపిల్ సంస్థ తమ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని బయటికి ఇవ్వదంటే దాన్ని బట్టి అది పాటించే గోప్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ కారణమే సెలబ్రెటీలు ఐఫోన్‌ను ఎంచుకోవడానికి కారణం. ఐఫోన్ల రేట్లు ఏ స్థాయిలో ఉన్నా సరే.. కొత్త మోడల్ వచ్చిందంటే చాలు హాట్ కేకుల్లా మొబైల్స్ అమ్ముడైపోతుంటాయి. ఐతే అంతంత ఖరీదు పెట్టి ఫోన్ కొన్నాక సర్వీస్ సరిగా లేకుంటే ఎవరికైనా మంట పుడుతుంది.

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు అలాగే మండినట్లుంది. యాపిల్ సంస్థను ట్యాగ్ చేస్తూ ఆయన తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ వేయడం గమనార్హం. ‘‘ఇండియాలో యాపిల్ స్టోర్ల నుంచి యాపిల్ ఉత్పత్తులు కొనేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ల సర్వీస్, విధానాలు ఏకపక్షంగా, భయంకరంగా ఉంటాయి’’ అని ట్వీట్ వేస్తూ యాపిల్, యాపిల్ సపోర్ట్ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశాడు నాగ్. ఈ స్థాయి సెలబ్రెటీ అంత ఫ్రస్టేట్ అవుతూ ట్వీట్ వేశాడంటే యాపిల్ వాళ్లు ఆయన్నెంత ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

గతంతో పోలిస్తే ఈ మధ్య యాపిల్ సర్వీస్ బాగాలేదన్న కంప్లైంట్లు చాలా ఎక్కువవుతున్నాయి. ఐఫోన్లతో పాటు వచ్చే యాక్సెసరీస్ ఒక్కక్కటిగా ఆపేస్తుండటం కూడా కస్టమర్ల అసహనానికి దారి తీస్తోంది. ఈ మధ్య రిలీజ్ చేసిన ఐఫోన్లకు ఛార్జర్ ఇవ్వడం కూడా ఆపేసిన సంగతి తెలిసిందే. దాని కోసం మళ్లీ కొన్ని వేలు పెట్టాల్సి రావడం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.