స్కూల్లో ఉన్నపుడే టీచర్‌తో హీరోయిన్ ప్రేమాయణం

హీరోయిన్లు సినీ రంగంలోకి వచ్చాక వారి ప్రేమాయణం గురించి రూమర్లు వినిపించడం మామూలే. వాటి గురించి ఓపెన్ అయ్యేవాళ్లు తక్కువమంది. ఐతే ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తమ జీవితంలో జరిగిన చిన్న లవ్ స్టోరీల గురించి మాత్రం బయట పెట్టేస్తుంటారు. ఆ వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా.. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడడం.. కొన్ని రోజుల కథ నడిచాక విడిపోవడం గురించి మాట్లాడుతుంటారు. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి సింగ్.. తన కొత్త వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ప్రమోషన్లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో తన స్కూల్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. తన టీచర్‌తో తాను కొన్ని రోజులు ప్రేమాయణం నడిపినట్లు ఆమె వెల్లడించి పెద్ద షాకిచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన తోటి కథానాయికలు ఈషా రెబ్బా, కుషితలతో పాటు నిర్మాత ఎస్కేఎన్ కూడా పాల్గొన్నారు.

పాత లవ్ స్టోరీల గురించి చెప్పమని ఎస్కేఎన్ అడిగితే.. తాను స్కూల్లో ఉన్నపుడు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని వెల్లడించింది రాశి సింగ్. ఆ బాయ్ ఫ్రెండ్ తన టీచరే అని రాశి చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. అతను తనకు క్వశ్చన్ పేపర్లు ముందే ఇచ్చేసేవాడని ఆమె చెప్పింది. వైవా టైంలో తనను ఏ ప్రశ్నలూ అడిగేవాడు కాదని.. తామిద్దరం ఆ పది నిమిషాలు కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లమని రాశి వెల్లడించింది. 

అప్పుడు ఏం చదువుతున్నావు, వయసెంత అని అడిగితే.. స్కూల్లో ఉన్నానని, తన వయసు 17 ఏళ్లు ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో అవాక్కయిన ఎస్కేఎన్.. ఇది పోస్కో కేసు కదా అని వ్యాఖ్యానించాడు. ఆ టీచర్ తనకు ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడని.. తనకు పెళ్లి కూడా అయిందని.. అప్పటి తమ స్టోరీ గురించి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడని రాశి తెలిపింది. రాజ్ తరుణ్ సరసన రాశి కథానాయికగా నటించిన ‘పాంచ్ మినార్’ ఇటీవలే రిలీజైంది. ‘3 రోజెస్’ ఈ నెల 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.