సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్ ముందుకు వెళ్ళదు. కానీ ఈ థియరీ తప్పని రుజువు చేసిన నాయికగా సాయిపల్లవి స్థానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. రామాయణలో సీతగా నటించిన తర్వాత తను కొత్తగా కమిట్ అయిన ప్రాజెక్టులు లేవు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మించబోయే సినిమాలో తనను అడిగారట కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెన్నై టాక్. పారితోషికంగా పదిహేను కోట్లు అడగటంతో పాటు కాసిన్ని ఎక్కువ డిమాండ్లు పెట్టినందు వల్లే పెండింగ్ లో ఉందనే గాసిప్ తిరుగుతోంది.

ఇది కాకుండా వెట్రిమారన్ తీస్తున్న అరసన్ కోసం సాయిపల్లవినే అడిగారట. పెర్ఫార్మన్స్ అవసరమైన క్యారెక్టర్ కావడంతో ఆమె మీదే హీరో శింబు సైతం ఆసక్తి చూపించాడట. ఇది కూడా ఇంకా తేలలేదు. నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో రూపొందిన రామాయణలో తన పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం ఖాయమని నమ్ముతున్న సాయిపల్లవి ఆపై చేయబోయే సినిమాల విషయంలో తొందరపడకూడదని భావిస్తోందట. అందుకే డెసిషన్లు లేట్ అవుతున్నాయని సన్నిహితుల మాట. రామాయణ మొదటి భాగం పూర్తయిపోయింది. సెకండ్ పార్ట్ కొంచెం అవ్వగా మిగిలింది త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నారు.

లైఫ్ టైం సీత లాంటి రోల్స్ చేశాక ఏ హీరోయిన్ అయినా డోలాయమానంలో పడటం సహజం. అయితే ఆదిపురుష్ తర్వాత కృతి సనన్, శ్రీరామ రాజ్యం తర్వాత నయనతార తమ రెగ్యులర్ పంధాలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. కానీ సాయిపల్లవి కేసు వేరే. తను ఎప్పటికీ రొటీన్ ధోరణిలో ఉండనంటుంది. అన్నట్టు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ జోడిగా నటించిన ఏక్ దిన్ ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు. షూట్ ఎప్పుడో అయిపోయింది కానీ ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. మరి సాయిపల్లవిలకి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ అవుతుందా లేక రామాయణ అవుతుందా అనేది ఇప్పట్లో తేలేలా లేదు.