అఖండ 3 ఉందని హింట్ ఇస్తున్నారా ?

రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో మాస్ జనాలను థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా లేకపోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దీని మీదే బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. పైగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడంతో రేట్ల పరంగా రాజీ పడకుండా పెద్దఎత్తున పెట్టుబడులు కుమ్మరించారు. ముఖ్యంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో తమ కాంబో స్థాయిని ఋజువు చేసిన బాలయ్య – దర్శకుడు బోయపాటి శీను ఈసారి డబుల్ మేజిక్ చేస్తారనే నమ్మకం అభిమానుల్లో పుష్కలంగా ఉంది. అయితే పార్ట్ 3 ఉంటుందా లేదానేది ఫ్యాన్స్ మెదడుని తొలుస్తూనే ఉంది.

తాజాగా టీమ్ పంచుకున్న ఒక పిక్ మూడో భాగాన్ని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే. రికార్డింగ్ స్టూడియోలో తెరపైన చివరి ఎండ్ క్రెడిట్ లో వచ్చే కార్డుని ఆ ఫోటోలో చూపించారు. దాని మీద జై అఖండ అని ఉంది. అంటే ఇది మరో సీక్వెల్ కి టైటిలని చెప్పుకోవచ్చు. ఇన్ సైడ్ టాక్ అయితే కొనసాగింపుకి లీడ్ ఇచ్చేలా బోయపాటి సీను ముగింపు ఇచ్చారని, భవిష్యత్తులో బాలయ్య డేట్లు, కమిట్ మెంట్లను బట్టి తెరకెక్కించాలని ముందే అనుకున్నారట. ఇప్పటిదాకా టాలీవుడ్ ఫ్రాంచైజ్ బ్లాక్ బస్టర్స్ లో గొప్ప స్థాయిలో చెప్పుకునే బాహుబలి, పుష్పలు రెండు భాగాల దగ్గరే ఆగిపోయాయి. మరి అఖండ 2 ఏమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి వరస ఘనవిజయాలు తర్వాత చేసినా మూవీ కావడంతో అఖండ 2 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి టైటిల్ రోల్ తో పాటు ఎమ్మెల్యేగా నటించిన బాలయ్య రెండో క్యారెక్టర్ కు కూడా ప్రాధాన్యం పెరిగిందని, అది పినిశెట్టి విలనిజం కొత్తగా ఉండటంతో పాటు క్లైమాక్స్ లో శివుడిగా స్వర్గీయ ఎన్టీఆర్ ని పునఃసృష్టించారనే లీక్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇవన్నీ నిజమై టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా చాలు క్రిస్మస్ వచ్చేదాకా అఖండ 2 మంచి ఊపుమీదుంటుంది.