మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు అభిమానులు. ‘ఖైదీ నంబర్ 150’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ మినహా ఏ చిత్రంతోనూ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయాడు. ‘సైరా’ పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నప్పటికీ.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఇక గత ఏడాది ‘భోళా శంకర్’ మూవీతో చిరు ఎంత పెద్ద షాక్ తిన్నాడో తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘మన శంకర వరప్రసాద్’ మూవీ మీద మెగాస్టార్తో పాటు అభిమానులూ భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి అంచనాలను అందుకుంటాడనే భావిస్తున్నారు. సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ చిత్రానికి సంబంధించి షూట్ చివరి దశలో ఉంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ కూడా సెట్లోకి అడుగు పెట్టాడు. చిరు-వెంకీ కలయికలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
ఈ సినిమా నుంచి రిలీజైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ పాటకు కొన్ని పేర్లను పరిశీలించి చివరికి ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక ఐటెం సాంగ్స్ చేస్తున్న తమన్నా భాటియాకే ఓటు వేసినట్లు చెబుతున్నారు. ‘స్త్రీ’ సహా పలు చిత్రాల్లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ తమ్మూ ఐటెం సాంగ్ చేసింది. మరోవైపు చిరుతో సైరా నరసింహారెడ్డి, భోళా శంకర్ చిత్రాల్లో జోడీగా నటించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్తో ఐటెం పాటలో చిందులు వేయనుందట. బహుశా ఈ పాటలో వెంకీ కూడా కనిపిస్తాడేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని గురించి అధికారిక సమాచారం రావచ్చు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates