పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా రికార్డు నెలకొల్పింది ఓజీ సినిమా. అభిమానులకు విందు భోజనం లాంటి సినిమాను అందించి వాళ్లకు దేవుడిలా మారిపోయాడు సుజీత్. ఈ సినిమాతో నిర్మాత డీవీవీ దానయ్య కూడా మంచి లాభాలే అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఆశ్చర్యకరంగా దానయ్యకు, సుజీత్కు విభేదాలంటూ కొన్ని రోజులుగా జోరుగా ఒక చర్చ జరుగుతోంది. ఓజీ కోసంసుజీత్ సొంతంగా రూ.6 కోట్లు ఖర్చుపెట్టుకున్నాడని.. ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టలేక దానయ్య వెనక్కి తగ్గితే సుజీత్ తన డబ్బును సినిమా క్వాలిటీ పెంచడానికి ఉపయోగించాడని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ప్రచారం చూసి సుజీత్ను కొనియాడుతున్న పవన్ ఫ్యాన్స్.. దానయ్యను టార్గెట్ చేస్తున్నారు. దానయ్యతో గొడవ వల్లే ఆయన నిర్మాణంలో చేయాల్సిన నాని సినిమాను వేరే ప్రొడక్షన్ హౌస్కు సుజీత్ తీసుకెళ్లిపోయాడనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే ఈ ప్రచారానికి సుజీత్ తెరదించేశాడు.
”దానయ్యతో తనకు ఎలాంటి గొడవ లేదని సుజీత్ స్పష్టం చేశాడు. ఓజీ సినిమా విషయంలో ఆయన పూర్తిగా సహకరించాడని అతను చెప్పాడు. చాలా మాట్లాడుతున్నారు, కానీ సినిమాను ప్రారంభం నుండి ముగింపు వరకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఓజీ కోసం నా నిర్మాత మరియు నా చిత్ర బృందం చూపిన నమ్మకం, నాకు వాళ్లిచ్చిన బలాన్ని మాటల్లో చెప్పలేను.
అదే ఈ చిత్రానికి ఈ రోజు బలాన్ని ఇస్తోంది. ఇది ఎవరికీ అంత తేలికైన విషయం కాదు, ప్రతి ప్రయత్నం నిబద్ధత నుండి వచ్చింది. దాన్ని గౌరవంగా ఉంచుకుందాం. పవన్ కళ్యాణ్ గారుమరియు ఓజీ పట్ల అభిమానులు చూపించిన ప్రేమ, పిచ్చి అర్థవంతంగా అనిపిస్తాయి.. దానయ్య గారు నాపై చూపించిన ప్రేమను, మద్దతుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను” అని సుజీత్ పేర్కొన్నాడు. దీంతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లే. నాని సినిమా స్క్రిప్టు పూర్తి చేసిన సుజీత్.. హీరో వచ్చేలోపు ప్రి ప్రొడక్షన్ పనుల మీద దృష్టిసారించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
