అనసూయ కామెంట్.. మూడో బిడ్డను కనేందుకు సిద్ధం

యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్‌ను చూస్తే ఇద్దరు పిల్లల తల్లిలాగా అస్సలు అనిపించదు. టెలివిజన్ యాంకరింగ్‌లో అంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ల దృస్టిని ఆకర్షించే సమయానికే ఆమె ఇద్దరు పిల్లల్ని కన్న సంగతి చాలామందికి తెలియదు. చాలామంది యాంకర్లతో పోలిస్తే వయసు చాలా ఎక్కువైనప్పటికీ అనసూయకున్న ఆకర్షణే వేరు.

ఒకవైపు తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటూనే.. పెళ్లి, భర్త, పిల్లల గురించి ఎప్పుడూ ఆమె దాచి పెట్టాలని కూడా చూడదు. ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది, వాళ్లతో ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది. తెరపై ఆమె చేసే పాత్రలు కూడా భిన్నంగా ఉంటాయి. అందరూ తన నుంచి గ్లామర్ క్యారెక్టర్లు ఆశిస్తే ‘క్షణం’లో నెగెటివ్ రోల్, ‘రంగస్థలం’లో రంగమ్మత్త లాంటి పాత్ర చేయడం అనసూయకే చెల్లింది. ఇప్పుడు అనసూయ నటిస్తున్న ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమాలో ఆమెది గర్భవతి పాత్ర కావడం విశేషం.

‘థ్యాంక్ యు బ్రదర్’ ఫస్ట్ లుక్ పోస్టర్లో నిండు గర్భంతో కనిపించి ఆశ్చర్యపరిచింది అనసూయ. దీని పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే అనసూయ మాత్రం ఆ పాత్ర చేయడంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడా మళ్లీ గర్భవతిని కావడానికి తనకు అడ్డంకేమీ లేదని.. మూడో బిడ్డను కనడానికి తాను సిద్ధమని ప్రకటించడం విశేషం. గర్భవతిగా ఉన్నపుడు అందరూ తనను అందరూ ఎంత బాగా చూసుకున్నారో గుర్తుందని, ఆ గారాబం తనకెంతో నచ్చుతుందని, అందుకే నిజ జీవితంలో మరోసారి గర్భవతిని కావడం తనకిష్టమే అని ఆమె అంది.

ఇద్దరు పిల్లల్ని కన్న తనకు మాతృత్వంలో ఉన్న అనుభూతి ఎలాంటిదో తెలుసని, అందుకే ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యానని అనసూయ చెప్పింది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనసూయ సోదరుడి పాత్రలో ‘మనసానమ:’ షార్ట్ ఫిలిం ఫేమ్ అశ్విన్ విరాజ్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.