ఇళ‌య‌రాజా గొడ‌వ‌పై ప్రొడ్యూసర్ల వివరణ

త‌న పాట‌ల‌ను అనుమ‌తి లేకుండా ఏదైనా సినిమాలో వాడితే లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా అస్స‌లు ఊరుకోవ‌డం లేదు. నోటీసులు ఇస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. గ‌త కొన్నేళ్ల‌లో చాలా సినిమాల మేక‌ర్స్‌కు ఇలాగే నోటీసులు వెళ్లాయి. చివ‌ర‌గా ఆయ‌న త‌మిళ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన అజిత్ న‌టించిన గుడ్ బ్యాడ్ అగ్లీ టీం మీద కోర్టుకెక్కారు. సినిమాలో త‌న పాత పాట‌లు కొన్ని వాడ‌డంపై ఇళ‌య‌రాజా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అజిత్ సినిమాను టార్గెట్ చేయ‌డంతో ఫ్యాన్స్ ఇళ‌య‌రాజా మీద మండిప‌డ్డారు. 

అదే స‌మ‌యంలో ఇళ‌య‌రాజా సంగ‌తి తెలిసి కూడా అనుమ‌తి లేకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ టీం ఆయ‌న పాట‌ల‌ను ఎలా వాడుకుంది అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ఈ చిత్రాన్ని నిర్మించింది తెలుగు నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేక‌ర్సే అన్న సంగ‌తి తెలిసిందే. ఆ సంస్థ ప్రొడ‌క్ష‌న్లో తాజాగా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో డ్యూడ్ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా మీడియాను క‌లిసిన మైత్రీ ర‌విశంక‌ర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ గొడ‌వ గురించి స్పందించారు.

తాము అనుమ‌తి తీసుకునే గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళ‌య‌రాజా పాట‌లు వాడామ‌ని ర‌విశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఒక్కో పాట రైట్స్ కోసం 15-20 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చుపెట్టిన‌ట్లు.. కాక‌పోతే ఆయా పాట‌ల‌కు సంబంధించి హ‌క్కులు ఉన్న సోనీ సంస్థ‌ సంస్థ ద‌గ్గ‌ర రైట్స్ తీసుకున్న‌ట్లు ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. ఐతే ఈ పాట‌ల హ‌క్కుల విష‌య‌మై స‌ద‌రు ఆడియో లేబుల్ మీదే ఇళ‌యారాజా  కేసు వేశార‌ని.. ఆ కేసు కోర్టులో న‌డుస్తోంద‌ని ర‌విశంక‌ర్ చెప్పారు.

ప్ర‌స్తుతానికి ఓటీటీ వెర్ష‌న్లో ఆ పాట‌ల‌ను తీసేశామ‌ని.. గురువారం ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వ‌చ్చాక త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తాము భారీ లాభాలు అందుకోక‌పోయినా.. డ‌బ్బులు మాత్రం పోగొట్టుకోలేద‌ని.. ఈ సినిమాతో కోలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చామ‌ని.. భ‌విష్య‌త్తులో అజిత్‌తో మ‌రిన్ని సినిమాలు చేస్తామ‌ని ర‌విశంక‌ర్ చెప్పారు.

మ‌రోవైపు త‌మ సినిమాకు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో నెగ‌టెవ్ క్యాంపైన్ న‌డుస్తోందంటూ మిత్ర‌మండ‌లి నిర్మాత బ‌న్నీ వాసు చేసిన వ్యాఖ్య‌ల మీద కూడా ర‌విశంక‌ర్ స్పందించారు. త‌మ వ‌ర‌కు అయితే మాత్రం విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమా ఆడాల‌ని కోరుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వేరే సినిమా పోవాలి అని కోరుకుంటే వాళ్ల‌కు అస‌లు బిజినెస్ తెలియ‌ద‌ని అర్థం అని ర‌విశంక‌ర్ అన్నారు. రేప్పొద్దున తాము సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో, అలాగే కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో కూడా సినిమాలు చేస్తామ‌ని.. అలాంట‌పుడు వేరే సినిమా దెబ్బ తినాల‌ని తాము కోరుకోమ‌ని.. అన్ని సినిమాలు బాగా ఆడితేనే ఇండ‌స్ట్రీ బాగుంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.