టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం అంటే మాస్ రాజా రవితేజదే. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టి.. చిన్న చిన్న పాత్రలతో ప్రతిభ చాటుకుని.. చాలా ఏళ్ల స్ట్రగుల్ తర్వాత హీరోగా అవకాశాలు అందుకుని.. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు రవితేజ. కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాల గురించి అతను అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో ఓపెన్ అవుతుంటాడు.
ఈ నెల 31న తన కొత్త చిత్రం మాస్ జాతర రిలీజవుతున్న నేపథ్యంలో.. దీపావళి కానుకగా విడుదలవుతున్న తెలుసు కదాలో హీరోగా చేసిన సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కంబైన్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు మాస్ రాజా. ఇందులో కెరీర్ తొలి రోజుల సంగతులను రవితేజ గుర్తు చేసుకున్నాడు. దర్శకుడు కృష్ణవంశీ.. తనను బెదిరించి నిన్నే పెళ్ళాడతాలో నటింపజేసిన విషయాన్ని అతను బయటపెట్టాడు.
రవితేజ సినిమా కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైంది. కానీ అతను ఇండస్ట్రీలోకి వచ్చింది నటుడు కావాలనే అట. కానీ కెరీర్ ఆరంభంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదట. వరుసగా రిజెక్షన్లు ఎదురు కావడం.. రెకమండేషన్ల వల్ల అర్హత లేని వాళ్లకు మంచి పాత్రలు వెళ్లడం చూసి.. నటుడిగా ప్రయత్నాలు ఆపేసి అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడట. ఐతే నిన్నే పెళ్ళాడతా సినిమాకు ఏడీగా పని చేస్తున్నపుడే.. సింధూరం సినిమాలో తనకు హీరోగా అవకాశం ఇస్తానని కృష్ణవంశీ మాట ఇచ్చినట్లు రవితేజ వెల్లడించాడు.
కానీ అప్పటికే తనకు తగిలిన ఎదురు దెబ్బల దృష్ట్యా కృష్ణవంశీ నిజంగా తనను పెట్టి సినిమా తీస్తాడనే నమ్మకం తనకు ఉండేది కాదని రవితేజ చెప్పాడు. ఇదిలా ఉంటే.. నిన్నే పెళ్ళాడతా సినిమాలో ఒక పాత్ర చేయమని కృష్ణవంశీ తనను అడిగితే.. తాను చేయనని చెప్పేసినట్లు రవితేజ వెల్లడించాడు. దీంతో ఈ సినిమాలో నటిస్తావా లేక సింధూరం సినిమా నుంచి తీసేయమంటావా అని తనను బెదిరించి కృష్ణవంశీ ఆ సినిమాలో నటింపజేసినట్లు రవితేజ వెల్లడించాడు. సింధూరం సినిమాలో నటించే విషయమై కృష్ణవంశీ మళ్లీ మళ్లీ తనతో మాట్లాడ్డంతో నిజంగానే తనతో సినిమా తీస్తాడనే నమ్మకం కలిగిందని రవితేజ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates