ఇంకో పది రోజుల్లో సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా రిలీజ్ కాబోతోంది. నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి రెండు వారాల ముందు నుంచే ప్రమోషన్లలో యాక్టివ్ గా ఉంటున్నారు. రేపో ఎల్లుండో సిద్ధూ రంగంలోకి దిగబోతున్నాడు. పోటీ కాస్త ఎక్కువే ఉన్న నేపథ్యంలో సిద్ధూ మూవీ సమ్ థింగ్ స్పెషల్ అనిపించాలి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, ప్రియదర్శి మిత్ర మండలి రేసులో ఉన్నాయి. అయితే రిస్క్ అన్నది కాంపిటీషన్ గురించి కాదు.
తెలుసు కదా పైకి ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది కానీ నీరజ కోన ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక సెన్సిటివ్ పాయింట్ తీసుకున్నారట. ఇది కనక సరిగ్గా కనెక్ట్ అయితే యూత్ ప్రేక్షకుల్లో ఒక బ్లాస్ట్ అవుతుందని, లేదా అదే పెద్ద రిస్క్ గా మారి వసూళ్లను శాశించవచ్చని ఇన్ సైడ్ టాక్. రిలేషన్ షిప్స్ గురించి బాలీవుడ్ లో డిస్కస్ చేసినంత బోల్డ్ గా తెలుగులో తీయరు, తీయలేరు. సామజిక పరిస్థితుల వల్ల ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఊరుకుంటారు. కానీ తెలుసు కదా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసిందని అంటున్నారు. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 17 దాకా వేచి ఉండాల్సిందే.
సక్సెస్ పరంగా సిద్ధూ జొన్నలగడ్డకు తెలుసు కదా చాలా కీలకం. ఎందుకంటే టిల్లు బ్రాండ్ తోనే ఇక్కడిదాకా వచ్చిన సిద్ధూకి జాక్ మాములు షాక్ ఇవ్వలేదు. తనను రెగ్యులర్ హీరో పాత్రల్లో చూసేందుకు జనం ఇష్టపడటం లేదని దాని ద్వారా అర్థం చేసుకున్నాడు. అందుకే తిరిగి రొమాన్స్ వైపు వచ్చేశాడు. కృష్ణ అండ్ హిజ్ లీలతో ఒకసారి మెప్పించిన అనుభవం ఉండటం దీనికి ప్లస్ అవుతోంది. తమన్ సంగీతానికి లాంగ్ రన్ లో మంచి అప్లాజ్ వస్తుందని యూనిట్ అంటోంది. పోటీ అయితే ఎక్కువగానే ఉంది ఓజి, కాంతార ఫైనల్ రన్ దగ్గరవుతున్న టైంలో తెలుసు కదా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates