ప్రయోగాలకు సై అంటున్న బాలయ్య

ప్రస్తుతం అఖండ 2 పూర్తి చేసి డిసెంబర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ కొత్త సినిమా అక్టోబర్ 24 ప్రారంభం కానుంది. వీరసింహారెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని మరోసారి ఆయనతో పని చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే ఈసారి రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా ఒక డిఫరెంట్ సెటప్ రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. పీరియాడిక్ డ్రామా ఫ్లేవర్ తో పాటు బాలయ్య ఇప్పటిదాకా చేయని సరికొత్త పాత్రని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఇది కూడా డ్యూయల్ రోలే కానీ చాలాసార్లు చూసిన తండ్రి కొడుకు, అన్న తమ్ముడు కాకుండా వేరేలా క్యారెక్టర్స్ ని తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. దీనికీ సంగీతం తమనే.

ఇక బాలకృష్ణ చేయబోతున్న మరో ఎక్స్ పరిమెంట్ ఆదిత్య 999 మ్యాక్స్. ఎప్పటినుంచో తన డ్రీం ప్రాజెక్టుగా రాసుకున్న ఈ కథను డెవలప్ చేసే బాధ్యత దర్శకుడు క్రిష్ కి ఇచ్చినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. అయితే ఇటీవలే ఘాటీ దారుణంగా ఫెయిలైన నేపథ్యంలో స్క్రిప్ట్ విషయంలో తొందరపడకుండా బాగా టైం తీసుకుని ఫైనల్ వెర్షన్ లాక్ చేశాకే ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారట. క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి తీసిన విధానం విపరీతంగా నచ్చే ఎన్టీఆర్ బయోపిక్ ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. కానీ అది అంచనాలు అందుకోలేదు. అయినా సరే ఆదిత్య 999కి ఆయనే సమర్ధ దర్శకుడని బాలకృష్ణ నమ్ముతున్నారు.

మాస్ ఫార్ములా నుంచి బాలయ్య బయటికి రావడానికి కారణముంది. అఖండ 2ని హిందీ బెల్ట్ లో ఎక్కువగా ప్రమోట్ చేయబోతున్నారు. దానికి తగ్గట్టే బడ్జెట్ ని నిర్మాతలు సిద్ధం చేసుకున్నారు. అది కనక క్లిక్ అయితే అదనంగా ఒక మార్కెట్ ఏర్పడుతుంది. ఇప్పటిదాకా బాలకృష్ణ ఈ విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. అఖండ 2 నుంచి అది మారబోతోందట. గోపిచంద్ మలినేని మూవీ, ఆదిత్య 999 రెండూ దేనికవే విభిన్నమైన ప్రయోగాలు. భగవంత్ కేసరి లాంటి అవార్డు విన్నింగ్ మూవీ ఇచ్చిన అనిల్ రావిపూడితో మరో సినిమా చేసే ఆలోచన కూడా బాలయ్యలో ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ సంక్రాంతి తర్వాత రావొచ్చు.