షూటింగ్ టైంలో ఎన్నో ప్రమాదాలు, అవాంతరాలు ఎదురుకున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ కు రిలీజ్ టైంలోనూ పరీక్షలు తప్పడం లేదు. టికెట్ ధరల పెంపు ఆశిస్తే తెలంగాణలో నిరాశ ఎదురయ్యింది. ఏపీలో ధారాళంగా ఇచ్చేశారు కానీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఓజి టైంలో బెంగళూరులో జరిగిన గొడవ, హైదరాబాద్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడ్డం లాంటివి వివాదాలకు దారి తీసి సినిమా మీద హైప్ ని అనవసరంగా డైవర్ట్ చేశాయి. ముందు రోజు రాత్రే వేద్దామనుకుని పర్మిషన్లు కూడా తీసుకున్న ప్రీమియర్లు హఠాత్తుగా క్యాన్సిల్ చేశారు. రేపు ఉదయం నుంచి షోలు ప్రారంభం కాబోతున్నాయి.
ట్రైలర్ ఎఫెక్టో మరేదైనా కారణమో చెప్పలేం కానీ కాంతార చాప్టర్ 1 మీద ఉండాల్సిన బజ్ అయితే అఫ్ లైన్, సోషల్ మీడియాలో కనిపించడం లేదు. నిర్మాతలు కంటెంట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులు ఎక్కువ ధరకు అమ్మినప్పటికీ ఖచ్చితంగా వెనక్కు వస్తుందనే నమ్మకంతో రిటర్నబుల్ అడ్వాన్స్ మీద రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఓజి బ్లాక్ బస్టర్ కావడంతో నైజాంలో తగినన్ని థియేటర్లు దొరకడం లేదని ట్రేడ్ టాక్. రెండో వారంలో తగ్గింపు రేట్లతో దాన్ని ప్రదర్శించడానికే అధిక శాతం ఎగ్జిబిటర్లు మొగ్గు చూపుతున్నారట. ఇది కొంచెం ఆందోళన కలిగించేదే.
ఇన్ని పరీక్షలు దాటుకుని వస్తున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ కు ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. ఎందుకంటే ఏపీలో 100, 75 రూపాయలు పెంపు తీసుకున్నారు కాబట్టి సినిమా అదిరిపోయిందని వినిపిస్తే తప్ప జనాలు థియేటర్లకు రారు. దసరా సెలవులు ఇంకో నాలుగు రోజుల్లో అయిపోతాయి. స్కూళ్ళు, కాలేజీలు తీస్తారు. ఈలోగా మాగ్జిమం రాబట్టేయాలి. వీకెండ్ ఉంది కానీ ముందు ఓపెనింగ్స్ బలంగా వస్తే బయ్యర్లకు నమ్మకం కలిగి స్క్రీన్లు పెంచే ప్రయత్నం చేస్తారు. మిరాయ్ లాగా టాక్ వస్తే ఇలాంటి ఫాంటసీ డ్రామాలు గట్టిగా నిలదొక్కుకుంటాయి. చూడాలి మరి ఫస్ట్ పార్ట్ మేజిక్ రిపీట్ అవుతుందో లేదో.
Gulte Telugu Telugu Political and Movie News Updates