వైఫ్ ఆఫ్ చైతు.. పా.రంజిత్‌తో

తెలుగమ్మాయిలు తెలుగులో గుర్తింపు సంపాదించడమే కష్టం అంటే.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి రేంజికి వెళ్లింది శోభిత ధూళిపాళ్ల. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ.. ఆమె రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. తన సినిమా కెరీర్ లాగే వ్యక్తిగత జీవితం కూడా ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంది. సమంత నుంచి విడిపోయిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య.. శోభితతో డేటింగ్ చేసి తర్వాత ఆమెను పెళ్లాడాడు. గత ఏడాది వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. 

పెళ్లి తర్వాత శోభిత ఫిలిం కెరీర్‌ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవీ ఒప్పుకోలేదు. గ్యాప్ పెరుగుతుండడంతో ఇక ఆమె సినిమాలు మానేస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ శోభిత ఇప్పుడు కొత్త సినిమాను అంగీకరించింది. అది తమిళంలో, ఒక విలక్షణ దర్శకుడితో కావడం విశేషం. ‘అట్టకత్తి’తో మొదలుపెట్టి ‘తంగలాన్’ వరకు వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత నటిస్తోంది.

‘వెట్టువమ్’ పేరుతో రంజిత్ తీస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆర్య, వీఆర్ దినేష్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. హీరోలతో సమానమైన పవర్ ఫుల్ రోల్‌లో శోభిత నటిస్తోందట. సమాజంలో అణగారిన వర్గాలకు సంబంధించి సామాజిక అంశాలతో సినిమాలు తీసే పా.రంజిత్ తన శైలికి భిన్నంగా.. ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో ‘వెట్టువమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.