ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనడంలో ఎవరికీ సందేహలు లేవు. దాదాపుగా అందరు టాప్ స్టార్ల సినిమాలకూ అతను సంగీతం అందించాడు. చాలా వరకు తన ఆల్బమ్స్ పెద్ద హిట్టయ్యాయి. మహేష్ బాబుకు సైతం ‘దూకుడు’ సహా అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు, నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు.
కానీ ‘గుంటూరు కారం’ విషయానికి వచ్చేసరికి తమన్ మీద విమర్శలు తప్పలేదు. ఆ సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ ఎంత వైరల్ అయినప్పటికీ.. దాని మీద ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా రిలీజ్ టైంలోనూ మహేష్ ఫ్యాన్స్ నుంచి నెగెటివిటీ ఎదుర్కొన్నాడు తమన్. ఐతే తన తప్పేమీ లేకపోయినా మహేష్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడంతో డార్క్ రూంలో కూర్చుని ఏడ్చానని తమన్ వెల్లడించాడు.
తాను మహేష్ బాబుతో పని చేసే అవకావం వచ్చినపుడల్లా ది బెస్ట్ ఇచ్చానని.. అయినా తన మీద కొంతమంది ఎందుకు నెగెటివిటీ పెంచుకున్నారో అర్థం కాలేదని తమన్ అన్నాడు. ఈ సినిమా నుంచి తనను తప్పించాలని వేల కొద్దీ ట్వీట్లు వేశారని, అది చూసి తాను కంగారు పడ్డానని చెప్పాడు. ఐతే త్రివిక్రమ్ తనకు అండగా నిలిచి అవేమీ పట్టించుకోవద్దని ‘గుంటూరు కారం’కు తనతోనే పని చేయించుకున్నట్లు తెలిపాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారని.. సినిమా ఫెయిల్యూర్కు తనే కారణం అన్నట్లుగా ట్రోల్ చేశారని తమన్ వాపోయాడు. సినిమా బాలేకపోతే తానేం చేస్తా అనుకుంటూ ఒక డార్క్ రూంలో కూర్చుని తాను ఏడ్చానని తమన్ వెల్లడించాడు. ఐతే అప్పుడు కూడా త్రివిక్రమే తనకు ఓదార్పునిచ్చాడని తమన్ తెలిపాడు. సోషల్ మీడియా అకౌంట్లను దగ్గరుండి డెలీట్ చేయించి, ఈ నెగెటివిటీకి దూరంగా ఉండి తన పని తనను చూసుకోమని చెప్పి త్రివిక్రమ్ ధైర్యం చెప్పినట్లు తమన్ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates