బన్నీ కూడా పడ్డాడు.. శాటిలైట్ కొంప కొల్లేరే

పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత. కొన్నేళ్ల కిందట్నుంచి కొత్తగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల రూపంలో నిర్మాతలకు కొత్త ఆదాయ వనరు దొరికింది. ఆ ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడ్డ సమయంలో నేరుగా కొత్త సినిమాలను కొని రిలీజ్ చేయడం నిర్మాతలకు గొప్ప ఉపశమనాన్ని అందించింది కూడా.

ఐతే ఇది పరోక్షంగా థియేటర్ల వ్యవస్థనే కాదు.. శాటిలైట్ మార్కెట్‌ను కూడా దెబ్బతీస్తోందన్న సంగతి గుర్తించట్లేదు నిర్మాతలు. ఇప్పటిదాకా వచ్చిన నష్టాలను భరించలేక, భవిష్యత్ మీద ఆశల్లేక థియేటర్లు మూతపడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మరోవైపు శాటిలైట్ మార్కెట్ ఒక్కసారిగా అనూహ్యపతనం చవిచూడటం ఆందోళన కలిగిస్తోంది.

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు, థియేటర్లలో మంచి విజయం సాధించిన చిత్రాలను టీవీల్లో తొలిసారి ప్రిమియర్‌గా వేస్తే మినిమం 15 టీఆర్పీ వచ్చేది. రీటెలికాస్ట్‌లో కూడా 10 ప్లస్ టీఆర్పీకి గ్యారెంటీ ఉండేది. కానీ తొలిసారి ప్రిమియర్ వేసినా 10 టీఆర్పీ రావడం కూడా కష్టమైపోతోంది. ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని ఇటీవలే టీవీల్లో వేస్తే 6 లోపు టీఆర్పీ వచ్చింది. అది డిజాస్టర్ మూవీ, పైగా ప్రిమియర్స్ లేటయ్యాయిలే అనుకుంటే.. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘భీష్మ’ను తాజాగా జెమిని టీవీలో ప్రసారం చేస్తే దానికి 6.65 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ నాన్ బాహుబలి హిట్ ‘అల వైకుంఠపురములో’ సెకండ్ టెలికాస్ట్‌లో 7.91 టీఆర్పీ మాత్రమే నమోదు చేసింది. సాహో, భీష్మలతో పోలిస్తే ఇది బెటర్ టీఆర్పీనే కదా అనుకోవచ్చు.

కానీ వేసవిలో ఈ చిత్రాన్ని తొలిసారి ప్రిమియర్‌గా వేస్తే రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ వచ్చింది. దాని దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. అలాంటిది కొన్ని నెలల తర్వాత సెకండ్ టెలికాస్ట్‌లో 8 లోపుకు టీఆర్పీ పడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటీటీల హవా పెరగడంతో నేరుగా వాటిలోనే కొత్త సినిమాలను విడుదల చేయడం మొదలుపెట్టడంతో ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నారు. దీంతో ప్రతి ఇంట్లోనూ కొత్త సినిమాలను ఓటీటీల ద్వారా టీవీల్లో చూసేయడం మొదలైంది.

ఈ నేపథ్యంలో టీవీ ఛానెళ్లలో సినిమాలు వేసే సమయానికి జనాలకు ఆసక్తి ఉండట్లేదని, అందుకే ఇలా టీఆర్పీలు పడిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు శాటిలైట్ మార్కెట్‌కు గట్టి దెబ్బే అని, ఇంతకుముందులా ఈ హక్కుల కోసం ఇక పోటీ ఉండకపోవచ్చని, ఆదాయం పడిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది.