రాజకీయాల కోసం 2018-20 మధ్య రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తిరిగి సినిమాల్లోకి వచ్చాక చేసిన చిత్రాల్లో పవన్ అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసిన మూవీ అంటే ‘ఓజీ’నే. రీఎంట్రీలో చేసిన తొలి మూడు చిత్రాలు రీమేక్లే కావడంతో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ‘హరిహర వీరమల్లు’ ఆరంభంలో క్యూరియాసిటీ పెంచినా.. తర్వాత ఆ చిత్రం బాగా ఆలస్యం కావడంతో అభిమానులు దాన్ని లైట్ తీసుకున్నారు.
కానీ ‘ఓజీ’ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఊగిపోయారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత గురువారమే ‘ఓజీ’ థియేటర్లలోకి దిగింది. అభిమానులకు ఫుల్ మీల్స్ అన్నట్లుగా సినిమా ఉండడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. ఇటు నిర్మాతకు, అటు బయ్యర్లకు ఈ సినిమా లాభాలు అందించేలా కనిపిస్తోంది. మొత్తానికి ‘ఓజీ’ సుఖాంతం అయింది.
ఇక ఫోకస్ పవన్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీదికి మళ్లనుంది. భవిష్యత్లో ఏమైనా మనసు మారుతుందేమో చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి అయితే ‘ఉస్తాద్’ తర్వాత మరో సినిమాలో నటించే ఉద్దేశం పవన్కు లేనట్లే. ‘ఓజీ’తో అభిమానులను సుజీత్ పూర్తిగా సంతృప్తిపరిచాడు. మరి హరీష్ శంకర్ ఏం చేస్తాడన్నది ఆసక్తికరం. సుజీత్ కంటే ముందు పవన్ అభిమానులను అమితానందానికి గురి చేసిన దర్శకుడు హరీషే. పవన్ ఫెయిల్యూర్లలో ఉండగా ‘గబ్బర్ సింగ్’తో వాళ్ల కడుపు నింపేశాడు. అందుకే హరీష్ అంటే పవన్ ఫ్యాన్స్కు ప్రత్యేక అభిమానం.
కానీ ఇప్పుడు హరీష్ సరైన ఫాంలో లేకపోవడం కొంత ఆందోళన కలిగించే విషయం. తన చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది. కానీ పవన్తో మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటాడనే అభిమానులు ఆశిస్తున్నారు. ‘ఉస్తాద్’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పవన్ మీద షూట్ ఆల్రెడీ పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates