థియేటర్లో ‘ఓజీ’ చూసిన పుష్ప

ఒకప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటరుకు వెళ్లి చూడడం పెద్ద విషయమే కాదు. కానీ ఇప్పుడు అది కూడా పెద్ద వార్త అయిపోయింది. ‘మెగా’ అనే బ్రాండు నుంచి బన్నీ బయటికి వచ్చేయడం.. సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడడం.. ఈ క్రమంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య.. అలాగే అభిమానుల మధ్య గ్యాప్ రావడం ఇందుకు కారణం. 

అసలే గ్యాప్ పెద్దదవుతుంటే.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి బన్నీ ప్రచారం చేయడంతో ఆ గ్యాప్ కాస్తా అగాథంలా మారిపోయింది. ఇక అప్పట్నుంచి ఆ గ్యాప్ ఎప్పుడు పూడుతుందా అని మ్యూచువల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల బన్నీ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మరణించిన సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా కనిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బన్నీ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’ని థియేటరుకు వెళ్లి చూశారు.

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బన్నీ.. ఏఎంబీ సినిమాస్‌కు వెళ్లి ‘ఓజీ’ సినిమా చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే సినిమా మొదలైన కాసేపటికి థియేటర్లోకి వచ్చిన బన్నీ.. పూర్తి కాకముందే వెళ్లిపోయాడు. అభిమానుల దృష్టిలో పడితే హడావుడి నెలకొని గందరగోళం తలెత్తవచ్చన్న ఉద్దేశంతోనే బన్నీ ఇలా చేసి ఉండొచ్చు. 

గత ఏడాది ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో జరిగిన విషాదం సంగతి తెలిసిందే. అందుకే బన్నీ జాగ్రత్త పడినట్లున్నాడు. ఏదేమైనప్పటికీ.. బన్నీ ఇలా థియేటర్‌కు వచ్చి మరీ పవన్ సినిమా చూడడం మెగా, అల్లు మ్యూచువల్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తోంది. ఇలాంటి పరిణామాలు ఇరు కుటుంబాల మధ్య, అలాగే అభిమానుల్లో నెలకొన్న గ్యాప్‌ను తగ్గిస్తాయని భావిస్తున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.