బ్లాక్ బస్టర్ వల్ల దెబ్బ తిన్న దర్శకుడు

పేరుకు బాలీవుడ్ నటుడే అయినప్పటికీ అనుపమ్ ఖేర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. దానికి రాష్ట్రాలతో సంబంధం లేదు. కార్తికేయ 2తో తెలుగువాళ్లకూ దగ్గరయ్యాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఆయన స్వంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్ మొన్న జూలైలో విడుదలయ్యింది. అరవింద్ స్వామి, బోమన్ ఇరానీ, జాకీ శ్రోఫ్, పల్లవి జోష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఆయన మీద అభిమానంతో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. టైటిల్ రోల్ పోషించిన శుభాంగి దత్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో విమర్శకులను మెప్పించింది.

ఇంతా చేసి తన్వి ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అదే రోజు సైయారా విడుదల కావడం అనుపమ్ ఖేర్ మూవీని నిలువునా చంపేసింది. 400 థియేటర్లలో తన్విని ఆడిస్తున్నా ప్రేక్షకులు ఒక ప్రేమకథను చూసేందుకు సిద్ధంగా ఉండటంతో ఈయన ఎమోషనల్ డ్రామాకు దూరంగా ఉండిపోయారు. ఏడాది పాటు స్క్రిప్ట్, సంగీతం కోసం సంవత్సర కాలం అన్నీ వృథా అయిపోయాయి. అసలు తన్వి ది గ్రేట్ అనే సినిమా వచ్చిందనే సంగతే జనాలకు రిజిస్టర్ కానంత దారుణంగా బొమ్మ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. దీనికి మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చడం మరో విశేషం.

ఇదంతా అనుపమ్ ఖేర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక హిట్ మూవీకి పోటీగా వెళ్ళినప్పుడు పరిస్థితులు ఒక్కోసారి ఎంత దారుణంగా ఉంటాయో తన్వి ద్వారా తెలుసుకున్నానని అన్నారు. అనుపమ్ ఖేర్ డైరెక్షన్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2002లో ఓం జై జగదీశ్ అనే మల్టీస్టారర్ తీశాడు. కానీ ఆడలేదు. మంచి అంచనాలతో వచ్చి ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. ఇప్పుడు తన్వి ది గ్రేట్ తో ఇరవై మూడేళ్ళ తర్వాత అదే ఫలితాన్ని రిపీట్ చేయడం గమనార్హం. గొప్ప ఆర్టిస్టుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనుపమ్ ఖేర్ దర్శకుడిగా వైఫల్యాలు చూడటం ఫైనల్ ట్విస్ట్.