పిల్లల్ని దూరం పెడితే ‘A’లాజీ

ఓజికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది కానీ సగటు మూవీ లవర్స్ కోణంలో చూస్తే ఇది కొంచెం బాధ కలిగించేదే. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్లే మల్టీప్లెక్సుల్లో 18 వయసులోపు పిల్లలను అనుమతించరు. గతంలో సలార్, యానిమల్ కు ఈ సమస్య వచ్చింది. కానీ వాటి బ్యాక్ డ్రాప్స్ వేరు. ఓజికున్న క్రేజ్ వేరు. సరిగా మాటలు రాని బుడ్డోళ్లు సైతం ఓజి జపంలో మునిగితేలుతున్నారు. ఒక ఎన్ఆర్ఐ టీనేజర్ తమను అమెరికా థియేటర్లలో అనుమతించమని చెబుతున్న వీడియో ఒకటి వైరలవుతోంది. సింగల్ స్క్రీన్లలో సమస్య లేదు కానీ చిక్కంతా బహుళ సముదాయాల్లోనే.

గత నెల కూలీకి ఇదే సమస్య వచ్చింది. సినిమా అంచనాలు అందుకోలేకపోయిన తర్వాత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కోర్టుకు వెళ్లి యు./ఏ అడిగింది కానీ పనవ్వలేదు. పైగా దాని కోసం అప్పటికప్పుడు కట్స్ చేసినా ఫలితం రాదని అర్థమైపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. దీని వల్ల చెన్నై లాంటి నగరాల మల్టీప్లెక్సులకు వెళ్లలేక రజని సినిమా వదులుకున్న కుటుంబాలు లేకపోలేదు. ఆ యాంగిల్ లో చూస్తే పవన్ కళ్యాణ్ కి ఇక్కడ అంతకన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఒకవేళ పిల్లలు బలవంతం చేస్తే తల్లితండ్రులు ఏదో రకంగా తంటాలు పడి సింగల్ స్క్రీన్లకు తీసుకెళ్లడం తప్ప మరో మార్గం ఉండదు.

అయితే అంత పట్టుదలగా అడల్ట్స్ ఓన్లీ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు టీమ్ సమాధానం కొంచెం కన్విన్సింగ్ గానే ఉంది. సెన్సార్ సూచించిన కట్స్ ఇరవైకి పైగా ఉన్నాయని, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు చేస్తే సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ తగ్గిపోతుందని, ఈ విషయం గురించి దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా తర్జనభర్జన పడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారట. గ్యాంగ్ స్టర్ డ్రామా కావడంతో వయొలెన్స్ కు ఎక్కువ స్కోప్ దొరికింది. ఇంటిమసీ సీన్లు లేకపోయినా హింస మోతాదు వల్లే సర్టిఫికెట్ ఇలా తీసుకోవాల్సి వచ్చిందట. సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల కోసం ఫ్యాన్స్ నిముషాలు యుగాల్లా గడుపుతున్నారు.